కర్నాటకం : బలపరీక్షకు ముహూర్తం ఖరారు..
బెంగళూరు : కర్నాటకానికి త్వరలోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా కొనసాగుతున్న సంక్షోభం కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ల రాజీనామల నేపథ్యంలో సీఎం కుమారస్వామి బలపరీక్షకు సిద్ధంకాగా.. తాజాగా స్పీకర్ ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 18న ఉదయం 11గంటలకు బలపరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
గత జన్మలో తనను హత్య ఎవరు చేశారో చెప్పిన బాలుడు... ఐదేళ్ల తర్వాత సోషల్ మీడియాలో హల్ చల్
సోమవారం బలపరీక్షకు బీజేపీ పట్టు
కర్నాటకలో జేడీఎస్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి.ఇలాంటి పరిస్థితుల్లో తాను అధికారంలో కొనసాగలేనని, శాసనసభలో విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉన్నానని సీఎం కుమారస్వామి గత శుక్రవారం ప్రకటించారు. దీంతో కర్నాటక రాజకీయం కీలక మలుపు తిరిగింది. కుమారస్వామి స్వయంగా బలపరీక్షను ఎదుర్కొంటానని చెప్పడంతో సోమవారం విశ్వాస పరీక్ష పెట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే స్పీకర్ అందుకు నిరాకరించారు.
సుప్రీం తీర్పు తర్వాతే
రాజీనామాలను స్పీకర్ అంగీకరించడంలేదని ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాతే బలపరీక్ష నిర్వహిస్తామని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టంచేశారు. అయితే స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన బీజేపీ సభ్యులు శాసనసభలో నిరసన చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.
కుమారస్వామికి పెద్ద పరీక్ష
కర్నాటక శాసనసభలో 224 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 16మంది రాజీనామా చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టు వారి రాజీనామాలు ఆమోదించాలని తీవ్రు ఇస్తే సభలో ఎమ్మెల్యేల సంఖ్య 208కి తగ్గుతుంది. దీంతో మేజిక్ ఫిగర్ 105కు చేరుతుంది. అసెంబ్లీలో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కలిపి బీజేపీకి 107 మంది సభ్యుల బలం ఉంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను తీసేస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ సంఖ్యాబలం 101 మాత్రమే. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్షలో కుమారస్వామి విజయం సాధించడం దాదాపు అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.