కర్నాటకం : రాజీనామా సవాలే లేదు.. సీఎం హోదాలో అసెంబ్లీ సమావేశాలకు వస్తానన్న కుమారస్వామి..
బెంగళూరు: కర్నాటకం క్షణానికో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో కుమారస్వామి రాజీనామాపై పుకార్లు షికారు చేస్తున్నాయి. గురువారం గవర్నర్ను కలవనున్నారన్న వార్తలు రావడంతో ఇక ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించిన కుమారస్వామి క్లారిటీ ఇచ్చారు.
కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు ఆదేశాలు, స్పీకర్, ప్రభుత్వానికి నోటీసులు, డెడ్ లైన్!
పదవి నుంచి తప్పుకునే సవాలే లేదు
కర్నాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం పదవికి రాజీనామా చేయాలని కుమారస్వామి నిర్ణయించుకున్నారని, దేవెగౌడ కూడా అదే విషయం సూచించారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ అనంతరం కుమార స్వామి నేరుగా గవర్నర్ వాజూబాయ్ వాలాను కలిసి రాజీనామ లేఖను అందజేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. వీటిపై ఘాటుగా స్పందించిన సీఎం ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. అసలు పదవి నుంచి తప్పుకోవాల్సిన అవసరమేంటని అడిగారు.
యడ్యూరప్పను అడగండి
శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరవుతానని కుమార స్వామి స్పష్టం చేశారు. 2008-09లో యడ్యూరప్ప సీఎంగా ఉన్నప్పుడు తలెత్తిన పరిస్థితులను ఆయన గుర్తు చేశారు. అప్పట్లో 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పుడు యడ్యూరప్ప ఎందుకు రిజైన్ చేయలేదని ప్రశ్నించారు. అప్పట్లో రెబెల్ ఎమ్మెల్యేలంతా కలిసి గవర్నర్ను కలిసి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినా పదవిలో ఎందుకు కొనసాగారని ఆయననే అడగండని సూచించారు. శుక్రవారం ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యమంత్రి హోదాలో హాజరవుతానని చెప్పారు.
సీఎం ఎందుకు రిజైన్ చేయాలి
మరోవైపు కర్నాటకలో రాజకీయ సంక్షోభం ముదిరిపాకాన పడటంతో హైడ్రామా కొనసాగుతోంది. కుమారస్వామి రాజీనామాపై వార్తలు వస్తుండటంతో మీడియా ప్రతినిధులు ఈ అంశంపై కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన సీఎం ఎందుకు రిజైన్ చేస్తారని ఎదురు ప్రశ్నించారు. శివకుమార్ సైతం 2008-09లో బీజేపీ హయాంలో అప్పటి సీఎం యడ్యూరప్పతో విభేధించి రాజీనామాచేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం హోదాలో యడ్యూరప్ప, కుమారస్వామిలో ఎవరున్నా చట్టం అందరికీ ఒకే రకంగా వర్తిస్తుందని, రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్పై ఉందని శివకుమార్ అభిప్రాయపడ్డారు.