గాలి జనార్దన్ రెడ్డి కేసులో మా జోక్యం లేదు, పూర్తి స్వేచ్చ: సీఎం కుమారస్వామి క్లారిటీ!
బెంగళూరు: మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కేసు విచారణతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇవ్వడంతో వారి పనివారు చేసుకుని వెలుతున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. గాలి జనార్దన్ రెడ్డిని ప్రభుత్వం వేధించలేదని సీఎం హెచ్.డి. కుమారస్వామి స్పష్టం చేశారు.
Recommended Video
గాలి జనార్దన్ రెడ్డి కోసం బెంగళూరు సీసీబీ పోలీసులు పగలు రాత్రి తీరకలేకుండా గాలిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మాట్లాడిన సీఎం. హెచ్.డి కుమారస్వామి గాలి జనార్దన్ రెడ్డికి విరుద్దంగా రూ. 20 కోట్ల డీల్ కేసు నమోదు కావడంతో విచారణ చెయ్యాలని పోలీసులు సిద్దం అయ్యారని అన్నారు.
ఆంబిడెంట్ కంపెనీ నిర్వహకులు అనేక మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని, ముఖ్యంగా మైనారిటీ ప్రజల నుంచి రూ. వందల కోట్లు వసూలు చేసి వారి రోడ్డున పడేశారని పోలీసులు కేసులు నమోదు చేశారని సీఎం కుమారస్వామి అన్నారు.
ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో అనేక మంది పెద్దల ప్రమేయం ఉందని పోలీసులు ఆధారాలు సేకరించారని, వారిని విచారణ చెయ్యడానికి సీసీబీ పోలీసులు సిద్దం అయ్యారని సీఎం హెచ్.డి. కుమారస్వామి చెప్పారు.
చట్టానికి వ్యతిరేకంగా ఆంబిడెంట్ కంపెనీ నిర్వహకులు నగదు వసూలు చేశారని ప్రజలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారని, నగదు లావాదేవీలతో అక్రమాలకు పాల్పడిన వారి వివరాలను పోలీసులు సేకరించారని, కేసు విచారణలో తాము ఎలాంటి జోక్యం చేసుకోమని సీఎం కుమారస్వామి వివరణ ఇచ్చారు.