‘కాలా’ను అనుమతించలేం, అలా చేస్తేనే మంచిది: సీఎం కుమారస్వామి
బెంగళూరు: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కాలా' చిత్రం కర్ణాటకలో విడుదలయ్యేందుకు కష్టాలు వీడటం లేదు. తాజాగా, కాలా చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయడానికి అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంపై ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు.
కావేరీ జలాల విషయం తేలేదాకా కాలా సినిమాను అనుమతించమని కుమారస్వామి అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను ఓ ముఖ్యమంత్రిగా కాకుండా, సాధారణ పౌరుడిగా, సగటు కన్నడ వ్యక్తిగా చేస్తున్నానని అన్నారు.
కాలా సినిమాను ఇప్పుడు విడుదల చేయడం నిర్మాతలకు శ్రేయస్కరం కాదని, వారు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉందని కుమారస్వామి అన్నారు. తాను కూడా ఓ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్గా పనిచేశానని గుర్తు చేశారు.
కావేరీ జలాల వివాదం సద్దుమణిగిన అనంతరం విడుదల చేస్తే బాగుంటుందని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. కన్నడ ఫిల్మ్ చాంబర్, కన్నడ ఆర్గనైజేషన్లు సైతం 'కాలా' విడుదలను వ్యతిరేకిస్తున్నాయని ఆయన చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం పాటిస్తుందని తెలిపారు.