కర్ణాటక ఎప్పుడూ ఇంతే: యడ్యూరప్పను రెండుసార్లు దెబ్బతీసిన కుమారస్వామి
బెంగళూరు: యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి మూడు రోజుల్లోనే రాజీనామా చేశారు. ఇంకా చెప్పాలంటే ఆయన కేవలం 55 గంటలు మాత్రమే సీఎంగా పని చేశారు. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు సీఎంగా ప్రమాణం చేసిన యెడ్డీ శనివారం సాయంత్రం ఐదు గంటలకు ముందే రాజీనామా ప్రకటన చేశారు.
యడ్యూరప్ప మూడుసార్లు సీఎం అయ్యారు. మూడుసార్లు అర్ధాంతరంగా పదవీ కాలం ముగించుకున్నారు. రాజకీయ కారణాలతో ఆ పదవిని నుంచి అర్ధంతరంగా తప్పుకోవడమో లేక ప్రభుత్వం రద్దవడమో జరిగింది. మొదటిసారి 8 రోజులు, రెండోసారి మూడేళ్ల 62 రోజులు, ఇప్పుడు మూడోసారి మూడు రోజులు సీఎంగా పని చేశారు.
కర్ణాటకలో ఎవరూ పూర్తి కాలం పదవిలే లేరు
కాగా, కర్ణాటకలో ఇద్దరు తప్ప ఏ సీఎం కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. అత్యధికసార్లు సీఎం అయి పూర్తికాలం పదవిలో కొనసాగని వారిలో నిజలింగప్ప ఉన్నారు. ఆయన నాలుగుసార్లు సీఎం అయినా పూర్తి కాలం ఎప్పుడూ కొనసాగలేదు. ఆయన నాలుగుసార్లు ఇతరులతో కలిసి పదవి పంచుకున్నారు.
నిజలింగప్ప నుంచి యెడ్డీ వరకు
నిజలింగప్ప తర్వాత యెడ్డీ పూర్తి కాలం పదవీకాలంలో లేని సీఎంగా రికార్డ్ సృష్టించారు. మొదటిసారి 2007 నవంబర్ 12 అధికారం చేపట్టిన యెడ్డీ నవంబర్ 19నరాజీనామా చేశారు. అప్పుడు కూడా ఆయన రాజీనామాకు కుమారస్వామే కారణం. ఆ తర్వాత 2008 మే30 నుంచి 2013 మే5న సీఎంగా పని చేశారు. ఆయన తర్వాత సదానంద గౌడ, జగదీశ్ శెట్టార్లు సీఎం పదవి చేపట్టారు. మళ్లీ 2018 మే 17న అధికారం చేపట్టిన యెడ్డీ రెండు రోజులు సీఎంగా కొనసాగి మే19న రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు కూడా కుమారస్వామే కారణం.
పూర్తికాలంలో కొనసాగింది ఇద్దరే
కర్ణాటక 15 అసెంబ్లీల్లో పూర్తికాలం ముఖ్యమంత్రులుగా ఇద్దరే ఉన్నారు. వారు ఎస్ఎం కృష్ణ, సిద్ధరామయ్య. వీరిద్దరూ కాంగ్రెస్కు చెందినవారే. దేవరాజ్ ఆర్స్(1972-77), రామకృష్ణ హెగ్డే(1983-85)లు అయిదేళ్ల కాలంలో ఒక్కరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ అప్పుడు అసెంబ్లీని మధ్యలోనే రద్దు చేశారు.
15సార్లు ఎన్నికలు
కర్ణాటక అసెంబ్లీకి మొత్తం 15సార్లు ఎన్నికలు జరగ్గా వాటిల్లో ఏడుస్లారు అర్ధంతరంగా రద్దైంది. వీటిల్లో అయిదుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. యడ్యూరప్ప ఫ్లోర్ టెస్టుకు వెళ్లి మరీ రాజీనామా చేశారు.