కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి గండం..బెంగళూరుకు ఆజాద్
కర్నాటక సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు ప్రారంభమయ్యాయా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికల ఫలితాలతో చాలామంది అసంతృప్తి నేతలు బయటపడటంతో కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, కేసీ వేణుగోపాల్ను పరిస్థితిని చక్కబెట్టేందుకు హుటాహుటిన బెంగళూరుకు పంపించింది.
కర్నాటక ప్రభుత్వంలో లుకలుకలు
కాంగ్రెస్-జేడీఎస్ల సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు ప్రారంభం అయ్యాయి. ఏడాదిగా ప్రభుత్వం నడుపుతున్న కుమార స్వామికి పదవి ముళ్లకిరీటంలా తయారైంది. ఎప్పుడు అసంతృప్తులు పార్టీ వీడుతారో అనే టెన్షన్ కుమారస్వామిలో నెలకొంది. ఇక తాజాగా కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్ జార్కిహోలీ, కే సుధాకర్లు బీజేపీ సీనియర్ నేత ఎస్ఎం కృష్ణను ఆదివారం తన నివాసంలో కలిసినట్టు సమాచారం. ఇది తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం వెంటనే ఆజాద్ను కేసీ వేణుగోపాల్ను పరిస్థితిని డీల్ చేయాల్సిందిగా బెంగళూరుకు పంపింది.
బెంగళూరుకు ఆజాద్ను పంపిన కాంగ్రెస్ హైకమాండ్
బెంగళూరుకు వెళ్లిన ఆజాద్, కేసీ వేణుగోపాల్లు రాష్ట్ర పార్టీ అధినాయకత్వంతో చర్చలు జరపనున్నారు. కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామిని వ్యతిరేకిస్తున్న వారిలో ఏడు నుంచి ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో జార్కిహోలీ, సుధాకర్ కూడా ఉన్నారు. అంతేకాదు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబైలో బీజేపీ నేతలను కలిసిన వారిలో వీరుకూడా ఉన్నారు. ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను కూడా వీరు కలిశారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని దించేసే ప్రయత్నం కూడా జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
అసంతృప్తులను తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో బీజేపీ
ఇదిలా ఉంటే ఈ సారి జరిగిన లోక్సభ ఎన్నికల్లో 28 సీట్లకు గాను బీజేపీ 25 సీట్లు గెలిచింది. ఇప్పటికే అసంతృప్తులను గుర్తించిన బీజేపీ వారిని తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. త్వరలోనే సంకీర్ణ ప్రభుత్వం పడిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని గతవారం యడ్యూరప్ప వ్యాఖ్యాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా కర్నాటకలో ఉంది. ఇక ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వానికి 117 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 79 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా 37 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు ఒక బహుజన్ సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు.