రాహుల్, సోనియాలతో భేటీ: కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వచ్చే బుధవారం(మే 23న) కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జేడీఎస్ నేత కుమారస్వామి ఢిల్లీలో వరుస భేటీలతో బిజి బిజీగా గడుపుతున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసిన ఆయన తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కోరారు.
అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 10 జన్పథ్ చేరుకుని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలను కలిశారు. మంత్రి వర్గ కూర్పుపై కాంగ్రెస్ అధినాయకత్వంతో చర్చించనున్నట్లు తెలిసింది.
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తున్నారు. మే 23న ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కుమారస్వామి అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలు రాష్ట్రాల సీఎంలను కూడా ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఢిల్లీలో ఎయిర్పోర్టు నుంచి బయటకు వస్తున్న ఆయనపై పలువురు జర్నలిస్టులు ప్రశ్నల వర్షం గుప్పించారు. ఈ క్రమంలో కూటమిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఈ(కాంగ్రెస్-జేడీఎస్) బీజేపీ వ్యతిరేక కూటమి ఎంత బలంగా ఉండబోతుంది?' అన్న ఓ జర్నలిస్ట్ ప్రశ్నకు కుమారస్వామి స్పందిస్తూ... 'ఇప్పుడే ఏం చెప్పలేం. అది కాలమే నిర్ణయిస్తుంది. పరిస్థితులను బట్టే మేం ముందుకు సాగుతాం' అని కుమారస్వామి పేర్కొన్నారు.
ఇక మీడియాలో వస్తున్న కథనాలను ప్రస్తావిస్తూ ఇప్పటిదాకా ఎవరికీ మంత్రి పదవులను కేటాయించలేదని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో చర్చల తర్వాతే అన్ని విషయాలపై స్పష్టత ఇస్తామని ఆయన వెల్లడించారు.
మరోవైపు ముఖ్యమంత్రి పదవి త్యాగం నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ మంత్రి పదవులు డిమాండ్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. జేడీఎస్ మాత్రం 15 బెర్త్లకే కాంగ్రెస్ను పరిమితం చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.