కాంగ్రెస్-జేడీఎస్ దోస్తానా..డౌటేనా? రాహుల్ టార్గెట్లో సిద్ధు!
బెంగళూరు: కర్ణాటకలో 14 నెలల పాటు కొనసాగిన కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) మధ్య స్నేహ సంబంధాలు ఇక ఎంతో కాలం కొనసాగే అవకాశాలు లేవు. అధికారాన్ని అందుకోవాలనే ఏకైక అజెండాతో ఈ రెండు పార్టీల మధ్య ఏర్పడిన దోస్తానాకు కాలం చెల్లినట్టే కనిపిస్తోంది. అధికారాన్ని కోల్పోయి కనీసం 24 గంటలు కూడా కాకముందే, కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే విడాకులు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి ఈ రెండు పార్టీలు. బుధవారం ఉదయం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. పొత్తు కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై కొంతసేపు చర్చించినట్లు చెబుతున్నారు. దోస్తీ కొనసాగించడం లేదా తెంచుకోవడంపై ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఆ రెండు పార్టీల నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
కుమారస్వామిని ఏ గతి పట్టించామో చూశారుగా! మీ పరిస్థితీ అంతే: బీజేపీ వార్నింగ్ బెల్స్
అధికారం కోసం ఒక్కటయ్యారు..
2018లో కర్ణాటక శాసనసభకు జరిగిన ఎన్నికల సందర్భంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడటం, ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ దక్కకపోవడం వల్ల కాంగ్రెస్-జేడీఎస్ ఏకతాటిపైకి వచ్చాయి. ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీకి అధికారం దక్కకూడదనే ఉద్దేశంతో ఈ రెండు పార్టీలు ఏకం అయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సరిగ్గా 14 నెలల తరువాత కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఈ రెండు పార్టీలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేసి, తమ పదవులకు రాజీనామా చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవడంలో విఫలమైంది. దీనితో కుమారస్వామి తన పదవికి రాజీనామా చేశారు. ఇక ఏకైక అతిపెద్ద పార్టీగా ఉన్నబీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనప్రాయమే.
విడిపోవడం ఖాయమే.
ఈ క్రమంలో- ఎన్నికల అవసరాల కోసం కాంగ్రెస్-జేడీఎస్ మధ్య కుదిరిన పొత్తు ఉంటుందా? ఊడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ దిశగా ఈ రెండు పార్టీల మధ్య చర్చకు కూడా వచ్చింది. బుధవారం ఉదయం పీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ పరమేశ్వర, మాజీ మంత్రులు డీకే శివకుమార్, కృష్ణ బైరెగౌడ, దేశ్పాండే తదితరులు దీనికి హాజరయ్యారు. తిరుగుబాటు లేవదీసిన ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి ఉద్దేశించిన సమావేశం అది. ఇందులోనే జేడీఎస్తో పొత్తు కొనసాగించాలా? వద్దా? అనే అంశాన్ని కూడా చర్చింనట్లు చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు అంశాన్ని కొందరు విలేకరులు కుమారస్వామి వద్ద ప్రస్తావించగా.. ఆయన దీనిపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఈ దిశగా తాము ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవట్లేదని అన్నారు. అసలు ఆ దిశగా ఆలోచన కూడా చేయలేదని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా విడిపోవడమమే మంచిదనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమౌతోంది.
రాహుల్ గాంధీ టార్గెట్లో ఉన్న సిద్దరామయ్య
ఇదిలావుండగా- కర్ణాటక సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ అధినేత రాహుల్ గాంధీ టార్గెట్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయిదేళ్ల పాటు అధికారంలో ఉండి, అపారమైన రాజకీయ అనుభవం ఉండీ.. పరిస్థితిని చక్కదిద్దలేకపోయారని రాహుల్ గాంధీ ఆగ్రహిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా జనతాదళ్(ఎస్)తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. అయిదేళ్ల పాటు అధికారంలో కొనసాగలేక చతికిల పడటాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా పరిగణిస్తున్నారు. అధికారంతో పాటు పరువునూ పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఆయన ఆగ్రహిస్తున్నారు. దీన్నంతటికీ సిద్ధరామయ్యను బాధ్యులను చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సంకీర్ణ కూటమిలో కాక పుట్టడానికి ఓ రకంగా సిద్ధరామయ్యే పరోక్ష కారకులని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో- సిద్ధరామయ్యపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చని అంటున్నారు.