నా రాజీనామాపై నా కంటే మీడియాకే ఎక్కువ ఆసక్తి ఉన్నట్టుంది: కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తన పదవికి రాజీనామా చేస్తారంటూ వచ్చిన వార్తలు ఒక్కసారిగా కలకలం పుట్టించాయి. రాజకీయంగా ప్రకంపనలు రేపాయి. శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోలేకపోతున్న కుమారస్వామి సోమవారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ వజూభాయ్ వాలాను కలుసుకోబోతున్నారని, అనంతరం తన రాజీనామా పత్రాన్ని అందజేస్తారంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి.
కుమార రాజీనామా? గవర్నర్తో అపాయింట్మెంట్ ఫిక్స్?
కుమారస్వామి చేసిన విజ్ఞప్తి మేరకు గవర్నర్ సాయంత్రం 7 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారంటూ కర్ణాటకలో వార్తలు వెల్లువెత్తాయి. జాతీయ మీడియా సైతం ఈ వార్తలపై ఫోకస్ పెట్టింది. ఈ వార్తలపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు ఉలిక్కిపడ్డారు. ఈ వార్తలను వారు కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లారు. నిజమేనా? అంటూ ఆరా తీశారు. ఈ వార్తలను కుమారస్వామి తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
తన రాజీనామాపై తనకంటే కూడా మీడియాకే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. తాను రాజీనామా చేయట్లేదని కుమారస్వామి స్పష్టం చేయలేదు. అయినప్పటికీ- గవర్నర్ అపాయింట్మెంట్ను కోరలేదని ఆయన తేల్చి చెప్పారు. కుమారస్వామి రాజీనామా వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా స్పందించింది. ఆయన రాజీనామా చేయట్లేదని వెల్లడించింది. గవర్నర్ అపాయింట్మెంట్ కోరలేదని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు.