కుమార రాజీనామా? గవర్నర్తో అపాయింట్మెంట్ ఫిక్స్?
బెంగళూరు: మూడు వారాలుగా కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి సోమవారం సాయంత్రం తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోయే దశకు చేరుకుంది. శాసనసభలో బలపరీక్షను ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయన గవర్నర్ వజూభాయ్ వాలా అపాయింట్మెంట్ కోరారు. ఈ సాయంత్రం 7 గంటలకు కుమారస్వామి.. రాజ్భవన్లో గవర్నర్ను కలుసుకుని తన రాజీనామా పత్రాన్ని అందజేస్తారని సమాచారం.
అసెంబ్లీలో బలపరీక్ష కన్నా నిమ్మకాయలు, బిర్యానీలపైనే చర్చ ఎక్కువ! ఎందుకంటే..!?
101కి క్షీణించిన కాంగ్రెస్ బలం..
13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడిన విషయం తెలిసిందే. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ కేఆర్ రమేష్కుమార్ ఆమోదించలేదు. అయినప్పటికీ- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారు శాసనసభలో అడుగు పెట్టే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో- ప్రభుత్వాన్ని కొనసాగించడానికి 105 మంది సభ్యుల బలం అవసరం అవుతుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సంఖ్యాబలం 101కి క్షీణించింది.
బీజేపీకి ఆహ్వానం ఇక లాంఛనమే
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీకి తగినంత బలం ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి శాసనసభలో 105 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి గుడ్బై చెప్పిన ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఆర్ శంకర్, నగేష్ కూడా ప్రస్తుతం బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీనితో ప్రతిపక్ష బీజేపీ సభ్యుల బలం 107కు చేరుతుంది. ఆయా సమీకరణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే- బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇక లాంఛనప్రాయమే అవుతుంది. ప్రత్యామ్నాయ పార్టీగా గవర్నర్ వజూభాయ్ వాలా బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడం ఖాయమే.
ఇక బలపరీక్ష లేనట్టే!
తనకు తానుగా కుమారస్వామి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో- శాసనసభలో ఇక బలపరీక్షకు అవకాశం ఉండకపోవచ్చు. నిజానికి- గురువారం నాడే కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉండగా.. దాన్ని సోమవారం వరకూ వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఇక బల నిరూపణ తప్ప కుమారస్వామి ముందు మరో ప్రత్యామ్నాయం లేదు. బల పరీక్ష నిర్వహించాల్సి వచ్చిన తరువాతైనా ఆయన రాజీనామా తప్పదు. ఈ పరిస్థితుల్లో తన సంఖ్యాబలాన్ని నిరూపించుకోలేక పరువు పోగొట్టుకోవడం కంటే హుందాగా తప్పుకోవాలని కుమారస్వామి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.