కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు: రాజకీయాలనుంచి తప్పుకోవాలనుందన్న మాజీ సీఎం
బెంగళూరు: కర్నాటక రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ఒక్కసారిగా కాంగ్రెస్ జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం సంకటంలో పడింది. ఇదంతా కొద్ది రోజుల క్రితం మాట. అప్పటి వరకు సీఎంగా ఉన్న కుమారస్వామి సభలో బలం నిరూపించుకోలేకపోవడంతో ఆయన గద్దె దిగాల్సి వచ్చింది. మొత్తానికి కొన్ని రోజుల పాటు కర్నాటక అసెంబ్లీలో హైడ్రామా నడిచింది. అనంతరం యడియూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
కుమార స్వామి సంచలన వ్యాఖ్యలు
తాజాగా తాను రాజకీయాలకు స్వస్తి పలకాలనే యోచనలో ఉన్నట్లు కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాన రాజకీయ అరంగేట్రం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిందని ఇష్టపడి రాజకీయాల్లోకి రాలేదని కుమారస్వామి వ్యాఖ్యానించారు. అయితే తనను రెండు సార్లు ముఖ్యమంత్రి చేసిన కన్నడిగులకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాభివృద్ధి కోసం, కర్నాటక ప్రజలకు మంచి మాత్రమే చేశానని చెప్పారు. ముఖ్యమంత్రిగా 14 నెలలు పనిచేసినట్లు చెప్పిన కుమారస్వామి తన పనితనంపై ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకుంటే తాను సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు.
కుల రాజకీయాలు ఎక్కువైపోయాయి
ఇక ప్రస్తుతం నెలకొన్న రాజకీయాల గురించి కుమారస్వామి ప్రస్తావించారు. ఇలాంటి రాజకీయాలు తన పొలిటికల్ లైఫ్లో ఇంతకు మునుపెన్నడూ చూడలేదని గద్గద స్వరంతో చెప్పారు ప్రస్తుత రాజకీయాలు మంచి కన్నా చెడును ప్రోత్సహించేలా ఉన్నాయని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి... కులాల కోసమే రాజకీయాలు అన్నట్లుగా పరిస్థితి తయారైందని అన్నారు. ఆ కులాల రొంపిలోకి తనను తన కుటుంబాన్ని లాగొద్దని విజ్ఞప్తి చేశారు. అనుకోకుండా జరిగిన రాజకీయ ప్రవేశం అనుకోకుండానే ముగింపు పలకాలని అందుకే పాలిటిక్స్కు గుడ్బై చెప్పాలనే యోచనలో ఉన్నట్లు కుమారస్వామి చెప్పారు. ఇక జీవితాన్ని తనకిష్టమైన వారి మధ్య ప్రశాంతంగా గడపాలని తాను భావిస్తున్నట్లు కుమారస్వామి వెల్లడించారు.
ఆది నుంచి కష్టాలతోనే ప్రయాణం చేసిన కుమారస్వామి
ఇదిలా ఉంటే కుమార స్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచే తన పదవి ఐదేళ్లు ఉంటుందా అనే చర్చ మొదలైంది. అసలే కాంగ్రెస్ మద్దతుతో గద్దెనెక్కిన కుమారస్వామికి ముందు నుంచే ఇటు కాంగ్రెస్ అటు జేడీఎస్ల నుంచి అంతర్గత వ్యతిరేకత ఉంది. అంతా బయటకు పడనప్పటికీ కుమారస్వామి సీఎం పీటంను అధిష్టించడం కాంగ్రెస్లోని కొందరు సీనియర్లకు నచ్చలేదు. దీంతో అప్పుడప్పుడు వారి అసంతృప్తిని బాహాటంగానే ప్రదర్శించేవారు. అయినప్పటికీ కుమారస్వామి వారిని కలుపుకుని పోయేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ సభ్యులు తన గురించి తప్పుగా మాట్లాడిన సమయంలో కుమారస్వామి కన్నీళ్లు కూడా పెట్టుకోవడం జరిగింది.