క్లైమాక్స్కు చేరిన కర్నాటకం.. కాసేపట్లో కుమారస్వామి బలపరీక్ష..
Recommended Video
బెంగళూరు : కొన్ని రోజులుగా కొనసాగుతున్న కర్నాటకానికి నేడు తెరపడనుంది. సంకీర్ణ సర్కార్ భవితవ్యం మరికాసేపట్లో తేలిపోనుంది. ఉదయం 11గంటలకు ముఖ్యమంత్రి కుమారస్వామి అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనున్నారు. జేడీఎస్, కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో సీఎం సభలో బల నిరూపణకు సిద్ధమయ్యారు. అయితే రెబల్ ఎమ్మెల్యేల రాజీనామా విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కర్నాటక సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
మద్దతు కూడగట్టే ప్రయత్నం
బలపరీక్ష నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యేలు సభకు రావాల్సిందిగా బలవంతం చేయలేరని సుప్రీకోర్టు తేల్చిచెప్పింది. ఇది కాస్తా జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అనర్హతవేటుతో ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకోవచ్చన్న సర్కారుకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు పిడుగుపాటులా మారాయి. దీంతో బలపరీక్షలో విజయం సాధించేందుకు అవసరమైన మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
పత్తాలేకుండా పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
16మంది రెబెల్ ఎమ్మెల్యేల్లో మాజీ మంత్రి రామలింగారెడ్డిని మాత్రమే బుజ్జగించగలిగారు. మిగిలిన 15మంది ఎమ్మెల్యేలు ముంబైలోనే మకాం వేశారు. అయితే వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ రిసార్ట్ నుంచి పత్తాలేకుండా పోవడం విశేషం. ఇదిలా ఉంటే బలపరీక్ష సందర్భంగా ఓటింగ్ సమయంలో సభ్యుల్లో సగం మంది కన్నా ఎక్కువ మంది ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తేనే ప్రభుత్వం గట్టెక్కుతుంది. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వానికి సంఖ్యాబలం లేనందున కుమారస్వామి బలపరీక్షకు ముందే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
ప్రభుత్వ మనుగడ కష్టమే
కర్నాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలుండగా.. స్పీకర్ను మినహాయిస్తే బీజేపీకి 105, కాంగ్రెస్కు 78, జేడీఎస్కు 37మంది మద్దతుంది. సభలో ముగ్గురు ఇండిపెండెంట్లు ఉన్నారు. ప్రస్తుతం 15మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు ఓటింగ్కు దూరంగా ఉంటే సభకు హాజరయ్యే సభ్యుల సంఖ్య 209కు తగ్గుతుంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం పడిపోకుండా ఉండాలంటే 105 మంది మద్దతు అవసరం. సభలో విశ్వాస పరీక్షపై ఓటింగ్ సందర్భంగా అసమ్మతి ఎమ్మల్యేలు మద్దతు నిరాకరించినా సభకు గైర్హాజరైనా సంకీర్ణ ప్రభుత్వం బలం 100కు పడిపోతుంది. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యే అవకాశంలేదని తేల్చిచెప్పడంతో కుమారస్వామి ప్రభుత్వ మనుగడ కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.