కర్నాటకం : క్లైమాక్స్కు చేరుకున్న కన్నడ రాజకీయం.. మరికాసేపట్లో తేలనున్న కుమారస్వామి భవితవ్యం..
బెంగళూరు : డైలీ సీరియల్ను తలపిస్తున్న కర్నాటకానికి నేటితో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. కుమారస్వామి ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న బీజేపీ కల నెరవేరుతుందా లేక కాంగ్రెస్ జేడీఎస్ వ్యూహం ఫలించి కథ సుఖాంతమవుతుందా అనే ప్రశ్నలకు మరికాసేపట్లో జవాబు దొరకనుంది. బలపరీక్షపై కొనసాగుతున్న చర్చను పూర్తి చేసి ఓటింగ్ నిర్వహించాలని గవర్నర్ వాజూభాయ్ వాలా ఇప్పటికే రెండు గడువులు ఇచ్చారు. అయితే స్పీకర్ వాటిని బేఖాతరు చేయడంతో సోమవారం ఏం జరగనుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుకు కారణమిదే..? ఏం చెప్పారంటే ..
కుమార ప్రభుత్వానికి చివరిరోజు
కుమారస్వామి ప్రభుత్వానికి సోమవారమే చివరి రోజని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప కుండబద్ధలు కొట్టారు. సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో గెలవడం అసాధ్యమని అంటున్నారు. ఇదిలా ఉంటే సోమవారం స్పీకర్ బలపరీక్ష నిర్వహించకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని గవర్నర్ వాజూభాయ్ వాలా నిర్ణయించుకున్నట్లు సమాచారం.
రాజీనామాకు సిద్ధమైన కుమారస్వామి
ఇదిలా ఉంటే ప్రస్తుత సంక్షోభంపై ముఖ్యమంత్రి కుమారస్వామి, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ ఇంట్లో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సభలో బలం నిరూపించుకోవడం అసాధ్యమన్న నిర్ణయానికి వీరు వచ్చినట్లు తెలుస్తోంది. చివరి అస్త్రంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు కుమారస్వామి సిద్ధమని ప్రకటించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ రెబెల్ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకుళ్లే ప్రయత్నం చేసే లోపు వారు మరో వీడియో రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రిని మార్చాలన్నది తమ డిమాండ్ కానే కాదని స్పష్టం చేశారు.
బీజేపీలో పెరిగిన ఉత్సాహం
మరోవైపు సంకీర్ణ ప్రభుత్వ పతనం ఖాయమని ధీమాతో ఉన్న బీజేపీ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టింది. కుమారస్వామి సర్కారు కూలిపోయిన తర్వత అనుసరించాల్సిన వ్యూహాలకు పదను పెడుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యేలతో కలిసి ఈ అంశంపై చర్చించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్, జేడీఎస్ సర్కారుకు మద్దతు ఇవ్వాలని బీఎస్పీ నిర్ణయించింది.