కుంభమేళా.. మరో తబ్లిగీ జమాత్: వెయ్యికి పైగా కరోనా కేసులు: ఆ పోలిక వద్దంటోన్న సీఎం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కొనసాగుతోన్న కుంభమేళాకు లక్షలాది మంది యాత్రికులు హాజరవుతున్నారు. గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. ఇదివరకటితో పోల్చుకుంటే.. ఈ రెండు రోజుల్లో లక్షలాది మంది పోటెత్తుతున్నారు. ఈ పరిణామాలు ఉత్తరాఖండ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడానికి కారణమౌతోన్నాయి. తొలి రోజు 400, రెండోరోజు 500 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ సంఖ్య వెయ్యిని దాటేసింది. లక్షలాది మంది భక్తులు ఒకేచోట గుమికూడుతున్నందున కోవిడ్ ప్రొటోకాల్స్ను పాటించేలా చేయడంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేతులెత్తేసింది.
Recommended Video
కుంభమేళాలో పాల్గొన్న భక్తులకు పరీక్షలు నిర్వహించగా రెండు రోజుల్లో వెయ్యి మంది యాత్రికులకు కరోనా పాజిటివ్గా తేలినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం 408 కేసులు నమోదుకాగా, మంగళవారం 594 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పారు. లక్షలాది మంది యాత్రికులు వస్తున్నప్పటికీ.. కరోనా నిర్ధారణ పరీక్షలు పరిమితంగానే ఉంటున్నాయి. కొంతమందికే వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. యాత్రికులు కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆందోళన వ్యక్తమౌతోంది.
కుంభమేళాను, న్యూఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్తో పోల్చవద్దంటూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ విజ్ఞప్తి చేశారు. తబ్లిగీ జమాత్ సమావేశాలతో కుంభమేళాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. గత ఏడాది కరోనా వైరస్ ప్రారంభ సమయంలో తబ్లిగీ జమాత్ పేరుతో ముస్లింలు మర్కజ్ భవనంలో నాలుగు గదుల మధ్య సమావేశాలు జరుపుకొన్నారని, దీనికి పూర్తి భిన్నంగా కుంభమేళా సాగుతోందని వివరణ ఇచ్చారు. బహిరంగంగా.. కుంభమేళా సాగుతోందని అన్నారు. తబ్లిగీ జమాత్ సమావేశాలకు విదేశాల నుంచి ముస్లింలు హాజరయ్యారని గుర్తు చేశారు.
కుంభమేళాలో ఇప్పటిదాకా విదేశీయులెవరూ పాల్గొనలేదని చెప్పారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను కోవిడ్ ప్రొటోకాల్స్ మధ్య, అన్ని జాగ్రత్తలను తీసుకుంటూ విజయవంతం చేస్తామని తీరథ్ సింగ్ రావత్ చెప్పారు. గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న సమయంలో దాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర అవగాహన ఉండేది కాదని, ఇప్పుడా పరిస్థితులు లేవని అన్నారు. కరోనాను ఎలా కట్టడి చేయాలనే విషయంపై పూర్తి అవగాహనతో ఉన్నామని తీరథ్ సింగ్ అన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.