మాజీ ఎంపి ఆత్మహత్యాయత్నం: 58 నిద్ర మాత్రలు?
కోల్కతా: తృణమూల్ కాంగ్రెసు నుంచి సస్పెన్షన్కు గురైన మాజీ పార్లమెంటు సభ్యుడు కునాల్ ఘోష్ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు వార్తలు వచ్చాయి. కోల్కతా ప్రెసిడెన్సీ జైలులో ఆయన ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శారదా చిట్ఫండ్స్ కుంభకోణంలో అరెస్టయిన ఆయన అప్పటి నుంచి ఆ జైలులోనే ఉంటున్నాడు.
ఘోష్ 58 నిద్ర మాత్రలు మింగినట్లు, ఆ విషయాన్ని జైలు అధికారులకు చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అతనికి వైద్యం అందించి, కడుపును శుభ్రం చేసినట్లు తెలుస్తోంది. ఆయన ప్రాణాలకు ముప్పు లేదని అంటున్నారు. ఘోష్ శారదా గ్రూప్ మీడియా ఆపరేషన్స్ చీఫ్గా పనిచేశారు.
అసలు నిందితులను పట్టుకోకపోతే తాను తన ప్రాణాలను తీసుకుంటానని సోమవారం కోర్టులో హెచ్చరించారు. దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని, కుంభకోణంలో పాలు పంచుకున్నవాళ్లు స్వేచ్ఛగా తిరుగుతుంటే తాను జైలులో మగ్గలేనని అన్నారు.
శారదా కుంభకోణం కేసులో సిబిఐ దాఖలు చేసిన తొలి చార్జిషీట్లో తృణమూల్ నేత ఘోష్ను మాత్రమే నిందితుడిగా చేర్చింది. బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో ఈ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. లక్షలాది మంది చిన్నపాటి మదుపుదారులను మోసం చేసినట్లు ఆరోపణలు వవచ్చాయి. ముగ్గురు ఇన్వెస్టర్లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.