మెంటల్ టార్చర్కు రూ.25లక్షలు.. బేషరతుగా సారీ: ఇండిగోకు లీగల్ నోటీసులిచ్చిన కమెడియన్ కునాల్
విమానాల్లో ప్రయాణం చేయకుండా తనపై ఆరునెలలు నిషేధం విధించడంపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా న్యాయపోరాటినికి దిగాడు. నిబంధనలకు విరుద్ధంగా విధించిన నిషేధాన్ని తక్షణమే రద్దుచేయాలంటూ ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థకు శనివారం లీగల్ నోటీసులు పంపాడు. నిషేధం రద్దుతోపాటు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, మానసికంగా వేధించినందుకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశాడు.
పైలట్ మెయిల్ తో మలుపు
జనవరి 28న ముంబై నుంచి లక్నో వెళ్తొన్న విమానంలో ప్రముఖ టీవీ జర్నలిస్టు అర్నబ్ గోస్వామితో అనుచితంగా ప్రవర్తించిన కారణంగా కునాల్ కమ్రాను ఆరునెలలు బ్యాన్ చేస్తున్నట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటించింది. ఆ వెంటనే ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, గో ఎయిర్ సంస్థలు కూడా కునాల్ పై నిషేధం విధించాయి. కాగా, కునాల్ ప్రయాణించిన విమానం పైలట్.. ఇండిగో యాజమాన్యానికి రాసిన మెయిల్ తో మొత్తం వ్యవహారం మలుపుతిరిగింది.
విచారణ లేకుండా చర్యలా?
అర్నబ్ గోస్వామితో కునాల్ వ్యవహరించిన తీరును ఎవరూ సమర్థించనప్పటికీ.. అతనిపై నిషేధాన్ని మాత్రం ప్రతిఒక్కరూ తప్పుపట్టారు. విమానంలో ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే.. అది ఎయిర్ లైన్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే.. రిటైర్డ్ హైకోర్టు జడ్జిచే విచారణ జరిపించి నిషేధంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కునాల్ విషయంలో ఈ ప్రక్రియ లేకుండా నేరుగా నిషేధం ప్రకటించారు. ఆ రోజు విమానాన్ని నడిపిన పైలట్ కూడా ఇండిగో యాజమాన్యం చర్యను నిరసించాడు.
హైప్రొఫైల్ కేసుల్లో అన్నీ మూసుకొవాలా?
కునాల్ కమ్రా నిషేధంపై ఆ రోజు విమానం నడిపిన పైలట్ ఇండిగో యాజమాన్యానికి రాసిన మెయిల్ లో ఇలా ఉంది.. ‘‘ఆ రోజు కునాల్ చేసిన పనిని నేను సమర్థించడంలేదు. కానీ మేం చెప్పిన ఆదేశాలన్నీ అతను పాటించాడు. సిబ్బందిపై ఎదురుతిరగడం, దురుసుగా మాట్లాడటంలాంటివేవీ చేయలేదు. నిజానికి మిగతా ప్రయాణికులకు, విమాన సిబ్బందికి కూడా అతను సారీ చెప్పాడు. ఏ విధంగా చూసినా ఆరు నెలలు నిషేధం విధించాల్సిన పెద్ద తప్పు కాదిది. ఒకవేళ హైప్రొఫైల్ కేసుల్లో మేం(పైలట్లు, సిబ్బంది) ఏమీ మాట్లాడొద్దనంటే ఆ మేరకు సంస్థాగత ఉత్తర్వులైనా జారీచేయాలి కదా''అని పైలట్ పేర్కొన్నారు.