నోటిదురుసు ఫలితం: ఇండిగో విమానంలో కునాల్ కామ్రాపై ఆరునెలల నిషేధం, ఎయిర్ ఇండియాలో కూడా..
Recommended Video
విమానంలో అసభ్యంగా ప్రవర్తించిన కమెడియన్ కునాల్ కామ్రాపై ఇండిగో ఆరునెలలపాటు నిషేధం విధించింది. తర్వాత ఇండియన్ ఎయిర్ లైన్స్ కూడా నిషేధిస్తున్నట్టు పేర్కొన్నది. తమ తదుపరి ప్రకటన వచ్చే వరకు బ్యాన్ అమల్లో ఉంటుందని స్పష్టంచేసింది. ఇటీవల కునాల్ కామ్రా ముంబై నుంచి లక్నో వెళ్తున్నారు. అయితే అందులో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి కూడా ఉన్నారు. అర్నాబ్తో కునాల్ కామ్రా అనుచితంగా ప్రవర్తించారు.
ఎగతాళి..
తన పక్క సీట్లో కూర్చొన్న అర్నాబ్ గోస్వామితో కునాల్ కామ్రా ఎగతాళిగా మాట్లాడాడు. అర్నాబ్ హెడ్ఫోన్స్ పెట్టుకున్న.. ఆయన లాగే మాట్లాడుతూ.. టీవీ డిస్కషన్లో మాదిరిగా ప్రవర్తించాడు. ఈ మేరకు ఓ వీడియో కూడా తీశాడు. దీనిపై ఇండిగో సంస్థ స్పందించింది. ప్రయాణికుడితో అనుచితంగా ప్రవర్తించినందుకు కామ్రాపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నది. ‘తమకు ప్రయాణికులు ప్రయోజనాలే ముఖ్యం, తోటి ప్రయాణికులను ఎగతాళి చేయడం సరికాదు. అప్పటికీ కునాల్కు సలహా ఇచ్చామని.. కానీ తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో చర్యలు తప్పలేదు' అని స్పష్టంచేసింది.
సరికాదు..
కునాల్ కామ్రా చర్యను పౌర విమానయాన శాఖా మంత్రి హర్దీప్సింగ్ పురి తప్పుపట్టారు. ఇది క్షమించరాని నేరమని, అతనిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. ఎయిర్ ఇండియాలో కూడా నిషేధిస్తామని స్పష్టంచేశారు. తోటి ప్రయాణికుడితో సఖ్యంగా మెలగాల్సింది పోయి.. టీవీ డిబేట్ మాదిరిగా ప్రవర్తించడం సరికాదన్నారు.
ఓకే.. ఎయిర్ ఇండియా
ఇండిగో విమానంలో ప్రయాణ నిషేధంపై కునాల్ కామ్రా స్పందించారు. తనను ఆరు నెలల సస్పెన్షన్ వేసిన ఇండిగో యాజమాన్యానికి వ్యంగ్యంగా ధన్యవాదాలు తెలిపారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఎయిర్ ఇండియాను ఎప్పటికీ నిషేధించబోతున్నారని చెప్పారు. ఈ మేరకు కునాల్ కామ్రా ట్వీట్ చేశారు. ఎయిర్ ఇండియా 100 శాతం వాటాలు విక్రయించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీనిపై కునాల్ కామ్రా సెటైర్లు వేశారు.