గ్యాంగ్రేప్: విచారణ పేరుతో 50రోజులు తిప్పారు, బాధితురాలి ఆత్మహత్య
భువనేశ్వర్: ఒడిశాలోని కొరాపుట్ జిల్లా కుందిలిలో విషాదం నెలకొంది. మూడు నెలల క్రితం సామూహిక అత్యాచారానికి గురైన బాలిక సోమవారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నాయకులు ఆందోళనలకు దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
గత అక్టోబరు 10న కుందిలి గ్రామం నుంచి ముసాగుడలోని తన ఇంటికి వెళ్తున్న తొమ్మిదో తరగతి బాలికపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. భద్రతా సిబ్బందే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు దర్యాప్తులో భాగంగా సుమారు 50 రోజులపాటు ఆ బాలికను పరీక్షల పేరిట ఆసుపత్రుల చుట్టూ తిప్పి చివరికి నవంబర్ 30న కుటుంబ సభ్యులకు అప్పగించారు.
బాధిత బాలిక సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కుందిలి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొంది. వీరికి పలు రాజకీయ పార్టీల నేతలు మద్దతుగా నిలిచారు.
సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. శవపరీక్షలు నిర్వహించకుండా బాధిత కుటుంబీకులు సిబ్బందిని అడ్డుకున్నారు. న్యాయం జరగనందుకే తీవ్ర మనస్తాపానికి గురైన తమబిడ్డ బలవన్మరణానికి పాల్పడిందని ఆరోపించారు. కాగా, ఈ కేసును క్రైం బ్రాంచ్ అధికారులతో విచారణ జరిపిపించాలని, సిట్టింగ్ జడ్జీతో జ్యుడీషియల్ విచారణ జరపాలని రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు.