కుర్లా రేప్, హత్య: నిందితుడికి జీవిత ఖైదు
ముంబై: ఐదేళ్ల కిందట(2010) మహారాష్ట్రలోని ముంబయి శివారు కుర్లాలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసిన కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారించిన ముంబయి ప్రత్యేక కోర్టు బుధవారం జీవితఖైదు శిక్ష విధించింది.
కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2010 జూన్ 5న కుర్లాకు చెందిన ఓ బాలిక అదృశ్యమైంది. 14రోజుల తర్వాత జూన్ 19న నెహ్రూనగర్లోని ఓ మురికివాడలో శవమై కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వైద్య పరీక్షల అనంతరం బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు తేలింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ఆధారంగా స్థానికంగా కేబుల్ ఆపరేటర్గా పనిచేసే జావేద్ షేక్ను జులై 1, 2010న అరెస్టు చేశారు.
అప్పటి నుంచి కేసును ప్రత్యేక న్యాయస్థానం పలు దఫాలుగా విచారించింది. ఈ కేసులో జావేద్ను దోషిగా నిర్ధారిస్తూ బుధవారం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘారత్ జీవితఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పుతో జావేద్ మరణించే వరకు జైలులోనే ఉండనున్నాడు.