ఇద్దరు జాత్యహంకారులు.. ఇద్దరూ గోడలు కట్టినోళ్లే.. : ట్రంప్-మోదీలపై కుష్బూ
అమెరికా అధ్యక్షుడు భారత్లో అడుగుపెట్టడంతో.. దేశంలో ఎక్కడ చూసినా ఆయన పర్యటన గురించే చర్చ జరుగుతోంది. అటు మీడియాలో,ఇటు సోషల్ మీడియాలో ట్రంప్ వార్తలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే భారత్-అమెరికా సంబంధాల్లో ట్రంప్ పర్యటనను ఆశాజనక మలుపుగా చూడాలని బీజేపీ చెబుతుండగా.. కాంగ్రెస్ మాత్రం విమర్శలు గుప్పిస్తోంది. ట్రంప్ పర్యటనతో దేశానికి వచ్చే ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ నేత,సినీ నటి కుష్బూ మోదీ-ట్రంప్ జోడీపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
నిజమైన నాయకుడికి,గాలివాటుగా నాయకుడైన వాడికి ఇదే తేడా అంటూ కుష్బూ ఓ ట్వీట్ చేశారు. ఒక జాత్యహంకారి(రేసిస్ట్) వేరే దేశం ప్రజలు తమ దేశంలోకి రావద్దని గోడ కడితే.. మరో జాత్యహంకారి తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు గోడ కట్టారని ట్రంప్,మోదీలపై పరోక్ష విమర్శలు చేశారు. ఇద్దరూ జోడీ నం.1 అంటూ ఎద్దేవా చేశారు.
That's the difference between a true leader and a leader who hit a jackpot in fluke.. A racist @POTUS who built a wall to keep certain people away and a racist @narendramodi who built a wall to hide his failures. #JodiNo1 👍👍👍🙏🙏🙏 https://t.co/hD00140aA5
— KhushbuSundar ❤️ (@khushsundar) February 24, 2020
అంతకుముందు మరో ట్వీట్లో ఓ వీడియోను పోస్టు చేసిన కుష్బూ.. ఢిల్లీలో చెలరేగిన హింసపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా,రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లను ఆమె ప్రశ్నించారు. ఆమె పోస్టు చేసిన వీడియోలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేయడం కనిపిస్తోంది. అమిత్ షా,రాజ్నాథ్ సింగ్లు దీనిపై ఏమైనా స్పందిస్తారా.. లేక మౌనవ్రతంలో ఉన్నారా అని కుష్బూ ప్రశ్నించారు. లేదా మరో కొత్త గోడను నిర్మించి వీటిని కప్పు పుచ్చుకునే ప్రయత్నం చేస్తారా అని నిలదీశారు.
కాగా,ట్రంప్ మోదీ పర్యటనపై ఆదివారం కాంగ్రెస్ ఓ సెటైరికల్ పోస్టర్ను ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ నాగరిక అభినందన సభ సందర్భంగా మోదీ హామీ ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల్లో 69లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారని కాంగ్రెస్ పార్టీ సెటైరికల్ పోస్టర్ను పోస్ట్ చేసింది. డొనాల్డ్ ట్రంప్ కోసం చప్పట్లు కొట్టేందుకు వీరందరినీ తీసుకోబోతున్నారని... వీరి వేతనం 'అచ్చే దిన్' అని పేర్కొంది. తేదీ,సమయం,వేదిక.. ఫిబ్రవరి 24,మధ్యాహ్నం 12గంటలకు మొతెరాలో స్టేడియానికి రావాల్సిందిగా తెలిపింది. కాంగ్రెస్ పెట్టిన ఈ సెటైరికల్ పోస్టర్పై నెటిజెన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు కాంగ్రెస్ పోస్టర్ను సమర్థిస్తుండగా.. మరికొందరు.. 'మరి కాంగ్రెస్ అధ్యక్ష పదవి భర్తీకి యాడ్ ఎప్పుడు ఇస్తున్నారు..' అని కౌంటర్ ఇస్తున్నారు.