మోడీకి, బీజేపీకి తమిళనాడులో చోటు లేదు : ఖుష్బూ, అందుకే #GoBackModi ట్రెండింగ్
చెన్నై : ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అటు నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా మోడీ టూర్ పై నిరసన తెలిపారు. గతేడాది సంభవించిన గజ తుపాన్ కారణంగా అతలాకుతలమైన తమిళనాడుపై, ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని విరుచుకుపడ్డారు. అదలావుంటే అటు బీజేపీ నేతలు మోడీకి మధురైలో ఘనస్వాగతం పలికారు.
మోడీ తమిళనాడు పర్యటనపై ఆరోపణలు గుప్పించారు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి ఖుష్బూ. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. తమిళనాడులో మోడీకి, బీజేపీకి చోటు లేదని పేర్కొన్నారు. ఇక్కడ కమలం వికసించబోదని రాశారు. రాష్ట్రానికి మోడీ వస్తానంటే ఇక్కడి ప్రజలు గో బ్యాక్ మోడీ అంటూ ట్రెండింగ్ చేస్తున్నారని.. అలాంటిది ఎన్నికల్లో ఎలా గెలిపిస్తారంటూ చురకలంటించారు. అయితే సోషల్ మీడియాలో మోడీకి వ్యతిరేకంగా పోస్టులు వైరల్ కావడంతో.. బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్. రాజా తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వానతి శ్రీనివాసన్ ట్వీట్ల యుద్ధం మొదలుపెట్టారు.