దారి చూపిన మోడీ, ఎందుకు కలిసి నడవొద్దు: ఖుష్బూ
చెన్నై/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన 'స్వచ్చ భారత్' పిలుపుకు ప్రముఖ తమిళనాడు రాజకీయ నాయకురాలు, నటి ఖుష్బూ మద్దతు పలికారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరు పాల్గొనాలని నరేంద్ర మోడీ కోరిన విషయం తెలిసిందే. దీనికి సినిమా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు మద్దతు పలుకుతున్నారు.
ఖుష్బూ కూడా మద్దతు పలికారు. మోడీ ఇప్పుడో మంచి దారి చూపించారని, ఆయన వెంట మనం ఎందుకు నడవకూడదన్నారు. భారత దేశానికి సేవ చేసేందుకు మనకు ఇదో చిన్న అవకాశమని ఆమె అభిప్రాయపడ్డారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, క్లీన్లీనెస్ ఇవి చాలా అవసరమన్నారు.
భారత సైన్యం సర్వసన్నద్ధంగానే ఉంది: జైట్లీ
కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తున్న పాకిస్తాన్ను నిలువరించేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగానే ఉందని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. పాక్ దుశ్చర్యల కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు నానాటికి జఠిలమవుతున్నాయన్నారు.
ఈ తరహా చర్యలు ఇరుదేశాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనేందుకు విఘాతం కలిగిస్తున్నాయన్నారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖల వెంట పాకిస్తాన్ నిత్యం జరుపుతున్న కాల్పుల కారణంగా సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.