అంతా మన కంట్రోల్లోనే, చైనా పీఎల్ఏను ‘గీత’ దాటనివ్వలేదు: రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత భూభాగాన్ని చైనా దళాలు ఆక్రమించుకుంటున్నాయని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టతనిచ్చారు. సరిహద్దులో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) దాటి చైనా బలగాల మనదేశ భూభాగంలోకి రాలేదని తెలిపారు. భారత సైనికులు భారత భూభాగాన్ని నిరంతరం కాపాడుతూనే ఉన్నారని చెప్పారు.
Recommended Video
కాంగ్రెస్ ఆరోపణలు నిరాధారం..
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్యూలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. చైనా దళాలను భారత సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, సరిహద్దులో పరిస్థితి తమ ఆధీనంలోనే ఉందని చెప్పారు. చైనా బలగాలు భారత భూభాగంలో వచ్చారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేశారు. చైనాతో కమాండర్ లెవల్ చర్చలు జరుగుతున్నాయని రక్షణశాఖ మంత్రి తెలిపారు. తాము సరిహద్దు సమస్య పరిష్కారం లభించిందనుకుంటున్నామని, తాము ఇందుకోసం ప్రయత్నాలు జరుపుతున్నామని తెలిపారు. దేశ భద్రత దృష్ట్యా అన్ని విషయాలను వెల్లడించలేమని రాజ్నాథ్ తెలిపారు.
మోడీతోపాటు నేనూ సైనికులను కలిశాం.. కాంగ్రెస్కు చురకలు
1962 నుంచి 2013 వరకు ఏం జరిగిందో తాము మాట్లాడదల్చుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వాలకు చురకలంటించారు. ప్రస్తుతం సైనిక బలగాలు గొప్ప ధైర్యసాహసాలను ప్రదర్శించి దేశ సరిహద్దులను కాపాడుతున్నారని తెలిపారు. మన సరిహద్దులోకి పీపుల్స్ లిబరేషన్ ఆర్మ(పీఎల్ఏ-చైనా ఆర్మీ) ప్రవేశించిందంటూ కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. గాల్వన్ ఘర్షణ తర్వాత తనతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా సైనికులను కలిసి వారిలో ధైర్యాన్ని నింపారని తెలిపారు. భారత సరిహద్దులోకి ఎవరు ప్రవేశించే సాహసం చేయరని తేల్చి చెప్పారు.
పాక్ దుస్సాహసంపై రాజ్నాథ్ మండిపాటు
భారతదేశంలో అంతర్భాగమైన గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతానికి ప్రోవిన్షియల్ హోదా ఇవ్వడాన్ని రాజ్నాథ్ ఖండించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై మండిపడ్డారు. గిల్గిత్-బాల్టిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) భారతదేశంలో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. పాక్ ప్రయత్నాన్ని తాము అడ్డుకుంటామన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్థాన్ అసహనంతో కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. జమ్మూకాశ్మీర్లోని పుల్వామా దాడికి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఇమ్రాన్ ఖాన్ గొప్ప విజయమని పాక్ మంత్రి జాతీయ అసెంబ్లీలో ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.