కరోనా కాదు, ఆకలితో చస్తామేమో.. లాక్డౌన్తో బతుకులు తలకిందులు.. రాజధాని నుంచి కూలీల మహానిర్గమనం
అప్పుడెప్పుడో సిరియా సంక్షోభంలో ఇలా తట్టాబుట్టా నెత్తినపెట్టుకుని, పిల్లాపాపలతో లక్షల మంది ఊళ్లొదిలి వెళ్లిన దృశ్యాలు చూశాం. మళ్లీ ఇప్పుడు మన దేశరాజధానిలో కరోనా విలయం కారణంగా వలసదారులు అదే పనిచేస్తున్నారు. ఢిల్లీ, దాని చుట్టుపక్కల నోయిడా, గురుగ్రామ్ తదితర మెగా సిటీల్లో కూలీలుగా పనిచేస్తోన్న లక్షలాది మంది.. లాక్ డౌన్ కారణంగా పనికోల్పోయారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో 21 రోజుల లాక్ డౌన్ కాస్తా సుదీర్ఘంగా కొనసాగే అవకాశమున్నట్లు మీడియా రిపోర్టులు. దీంతో రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితుల్ల.. తిండిలేక, గుడిసెలకు అద్దెలు కట్టలేక పేదలంతా సొంతూరిబాటపట్టారు.
'
సమన్వయ లోపం..
లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో వారంతా ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వందల కిలోమీటర్ల దూరంలోని తమ సొంత ఊళ్లకు నడిచి వెళుతున్నారు. మిగతా రాష్ట్రాల్లోనూ వలసదారులు నడకదారిలో ఊళ్లకు వెళ్లినప్పటికీ.. ఢిల్లీ అంతటి స్థాయిలో మాత్రం ఎక్కడా జరగలేదు. పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే పలు మార్లు లాక్ డౌన్ ఆదేశాలను సవరించిన కేంద్రం.. కూలీలపై మాత్రం కనికరం చూపకపోవడం విమర్శలకు తావిచ్చినట్లయింది. లాక్ డౌన్ విషయంలో చాలా చోట్ల కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య సమన్వయలోపం కొట్టినట్లు కనిపించింది. కొన్ని మినహాయింపుల కోసం పలువురు సీఎంలు నేరుగా ప్రధాని మోదీకి ఫోన్లు చేసి, లేఖలు రాసే పరిస్థితి నెలకొంది.
పెద్దలకు విమానాలు.. పేదలకు నడకా?
పైగా, ఢిల్లీ నుంచి అప్పటికే వెళ్లిపోయిన కూలీలను యూపీలోకి రానివ్వొద్దంటూ కేంద్ర హోం శాఖ ఆదేశించడం మరింత వివాదం రేపింది. కరోనా కరతాళనృత్యం చేసిన చైనా, ఇతర విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ప్రత్యేక విమానాల్లో రప్పించిన కేంద్రం.. వలస కూలీల విషయంలో మాత్రం ఇంత దారుణంగా వ్యవహరించడమేంటని సర్వత్రా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. హైవేపై బిడ్డల్ని, బట్టల మూలల్ని ఎత్తుకుని నడుస్తూ తల్లులు పడుతోన్న అరిగోస అందర్నీ కంటతడిపెట్టించేలా ఉంది. రోడ్డు పక్కన చెట్ల నీడలో సేద తీరుతూ ముందుకు సాగుతున్నారు. కరోనా భయాల కారణంగా మొదటి రెండ్రోజులు ఏ ఊళ్లోనూ కూలీలకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకలేదు. ‘కరోనా వైరస్ సంగతేమోగానీ.. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం..'అని పేద కూలీలు ఒక్కతీరుగా రోదిస్తున్నారు. అయితే..
ఎట్టకేలకు 1000 బస్సులు..
వలస కూలీల మహానిర్గమనం ఫొటోలు, వీడియోలు వైరస్ కావడంతో, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఉదార స్వభావులు, ప్రతిపక్ష పార్టీల నేతలు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. దారి మధ్యలో కొన్ని చోట్ల ఆహారం, నీళ్లు ఏర్పాటు చేసి పేదలను ఆదుకున్నారు. ఇళ్లకు వెళ్లిపోతున్న కూలీల సంఖ్య గంటగంటకూ పెరుగుతుండటంతో ఇకలాభంలేదనుకుని కేంద్రం.. ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కారుకు శనివారం ఆదేశాలిచ్చింది. దీంతో ఎట్టకేలకు 1000 బస్సుల్ని ఏర్పాటు చేశారు. అప్పుడు మరో సమస్య తలెత్తింది..
ఘజియాబాద్ లో గుంపులుగా..
వలస కూలీల కోసం యూపీ ప్రభుత్వం బస్సులు ఏర్పాటు చేసిన తర్వాత మరో కొత్త సమస్య ఎదురైంది. అప్పటిదాకా దూరదూరంగా నడిచిన కూలీలంతా.. బస్సులు ఎక్కేందుకు ఒక్కసారే గుంపులుగా పోగయ్యారు. ఘజియాబాద్ హైవేపై ఒక్కో బస్సు చుట్టూ కనీసం 500 మందికి తగ్గకుండా జనం గుమ్మికూడిన దృశ్యాలు ఆందోళనను రెట్టింపు చేసేలా ఉన్నాయ. దీంతో సీఎం యోగి ఆదిత్య నాథ్.. ప్రజలు గుంపులుగా కూడొద్దని, ఎక్కడివాళ్లు అక్కడే ఆగిపోవాలని పిలుపునిచ్చారు. బస్సుల్ని దగ్గరికే పంపుతామని భరోసా ఇచ్చారు. బస్సుల్లో వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు..
ఆస్పత్రుల్లోనూ అదే సీన్..
వివిధ వ్యాధుల బారినపడి ట్రీట్మెంట్ కోసం ఢిల్లీలోని సర్కారీ దవాఖానలకు వచ్చిన ఇతర రాష్ట్రాల పేదల పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. వైద్య వ్యవస్థ మొత్తం కరోనా కట్టడికే పరిమితమైపోవడం.. ఎమర్జెన్సీ ఆపరేషన్లు తప్ప మిగతా కేసుల్ని వాయిదా వేడంతో వేల మంది పేషెంట్లు, వాళ్లకు సాయంగా వచ్చిన కుటుంబీకులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో ఇళ్లకు తిరిగివెళ్లలేక ఢిల్లీలోనే చిక్కుకుపోయారు. ఇలాంటి దీనగాదలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తుండటంతో కేజ్రీవాల్ సర్కారు చర్యలకు ఉపక్రమించింది. శనివారం నుంచి అన్ని ఆస్పత్రులు, స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్ల వద్ద ఆహార సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది.
Recommended Video
అందుకే ఈ భయాన పరిస్థితి..
లాక్ డౌన్ ప్రకటన విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు కేంద్రం ఆచితూచి వ్యవహరించలేదని సొంత పార్టీ మంత్రులే విమర్శిస్తుండటం గమనార్హం. సరుకుల రవాణా పరంగా నిత్యం ఎన్నో ఎబ్బందుల్ని ఎదుర్కొనే ఈశాన్య రాష్ట్రాలు, ప్రత్యేకించి అస్సాం లాక్ డౌన్ కు ప్రిపేర్ కాలేదని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి సోనోవాల్ బాహాటంగా అన్నారు. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 ఎత్తివేత సమయంలోనూ కేంద్రం ఇలాగే వ్యవహరించిందని, నిత్యావసరాలు, ఎమర్జెన్సీ ఏర్పాట్లపై డ్రిల్స్ లేకుండానే నిర్ణయాన్ని ప్రకటించడంతో ఘోరంగా ఇబ్బందులు పడ్డామని ఆ రాష్ట్ర అధికారులు గుర్తుచేస్తున్నారు. ఇంత సుదీర్ఘకాలం(21 రోజుల పాటు) లాక్ డౌన్ ప్రకటించే ముందు.. కనీసం 48 గంటలైనా ప్రజలకు వెసులుబాటు కల్పించిఉండాల్సిందని, 25 శాతం రవాణానైనా అందుబాటులో ఉంచాలని యూపీ మాజీ డీజీపీ ప్రకాశ్ సింగ్ అభిప్రాయపడ్డారు.