ప్రభుత్వాలు మారవా: దారిమధ్యలోనే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ...
విజయనగరం: ఇదిగో మీకు ఇది చేశాం... అది చేశాం.. మాకు తిరిగి మళ్లీ ఓట్లు వేయండి పూర్తికాని మిగతా కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తామని ప్రభుత్వాలు అలివిగాని హామీలు ఇస్తున్నాయి. కానీ గ్రామాల్లో కెళ్లి చూస్తే పరిస్థితి మాత్రం అదే దుర్భరంగా కనిపిస్తుంది. అంతేకాదు కనీస సదుపాయాలు కూడా లేని గ్రామాలు చాలానే దర్శనమిస్తాయి ఆంధ్రప్రదేశ్లో. ఇందుకు నిదర్శనం విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనే.
లంచం ఇవ్వలేక సేలం బస్టాండ్లో ఆంధ్ర మహిళ కాన్పు
విజయనగరం జిల్లాలో ఓ నిండు గర్భవతి తీవ్ర నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రికి తరలించే మార్గంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఆ హాస్పిటల్ గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక్కసారిగా ఆ మహిళకు నొప్పులు మొదలవడంతో ఇంట్లో వారు ఆమెను కావడిలో కూర్చోబెట్టి అటవీప్రాంతం మధ్యలో తీసుకెళ్లారు. దారికూడా సరిగ్గా లేదు. మట్టిరోడ్డు... అందులో రోడ్డుపై అన్నీ గులకరాళ్లు.ఎగుడు దిగుడుగా ఉంది. నాలుగు కిలోమీటర్లు మహిళను కావడిలో మోసుకెళ్లగానే నొప్పులు తీవ్రరూపం దాల్చాయి. దీంతో ఆమెతో పాటే ఉన్న ఇతర మహిళలు కావడిని కిందకు దించి వారే పురుడు పోశారు.
గ్రామానికి సరైన రహదారులు వేసి రవాణా సౌకర్యం కల్పించాలని పలుమార్లు అధికారులను వేడుకున్నామని అయినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు బాధిత బంధువులు. గర్భవతిని నేలపైనే కూర్చోబెట్టి కాన్పు చేశారు. మరో ఇద్దరు మహిళలు శిషువుకు బొడ్డు తాడును బ్లేడ్తో కోసి తొలగించారు. ఇదంతా వీడియోలో చిత్రీకరించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలాంటి ఘటనే కొద్ది రోజుల క్రితం అంటే జూలై 29న ఇదే విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. సరైన రహదారి లేక ఒక గర్భవతిని 12 కిలోమీటర్లు మోసుకెళ్లారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లాలో కూడా సరైన సదుపాయాలు లేక ఒక నిండు గర్భవతిని మంచంపై ఒక కిలోమీటర్ వరకు మోసుకెళ్లిన ఘటన వెలుగు చూసింది. ఆమె కూడా దారి మధ్యలోనే బిడ్డకు జన్మనిచ్చింది. సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో అంబులెన్స్ తన ఇంటికి చేరుకోలేకపోయింది. దీంతో ఆమెను మంచంపైనే పడుకోబెట్టి ఇంటి సభ్యులు మోసుకెళ్లారు.