లడఖ్కు ఆరో షెడ్యూల్ హోదా ఇస్తేనే ఎన్నికలు- అమిత్షాకు తెగేసి చెప్పిన అఖిలపక్షం...
జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం ఇప్పటికీ అక్కడ పరిస్ధితులను నియంత్రించడంలో విఫలం అవుతుందని స్ఫష్టమవుతోంది. తాజాగా కేంద్రపాలితంగా మారిన లడఖ్కు ఆరో షెడ్యూల్ హోదా ఇవ్వాలని కోరుతూ అక్కడి రాజకీయ పార్టీలు స్ధానిక హిల్ కౌన్సిల్ ఎన్నికలను బహిష్కరించాయి. ఇందులో బీజేపీ కూడా ఉండటం విశేషం.
హిల్ కౌన్సిల్ ద్వారా లడఖ్ అభివృద్ధి చేయాలన్న కేంద్రం ఆలోచనకు ఎన్నికల బహిష్కరణ రూపంలో గండి పడటంతో అక్కడి అఖిలపక్షాన్ని హోంమంత్రి అమిత్షా అపాయింట్మెంట్ ఇచ్చి చర్చలు జరిపారు. రాజ్యసభ మాజీ ఎంపీ, లడఖ్లోని థిక్సే మఠాధిపతి స్కైబ్జీ థిక్సే ఖాంపో రింపోచెయ్ నేతృత్వంలోని ఈ బృందం తాజా పరిణామాలపై అమిత్షాతో అరగంటపాటు చర్చించింది. ఇతర ప్రాంతాల వారి నుంచి లడఖ్ను రక్షించుకునేందుకు ఈ ప్రాంతానికి ఆరో షెడ్యూల్ స్టేటస్ ఇవ్వాలని అమిత్ షాను వారు కోరారు. ఈ భేటీలో హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి, హోంశాఖ స్వతంత్ర హోదా మంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొన్నారు.
గతేడాది ఆగస్టు 5న అమిత్షా రాజ్యసభలో జమ్మూ కశ్మీర్కు స్వయంప్రతిపత్తి నిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసే బిల్లును ప్రవేశపెట్టారు. ఈ తర్వాత అసెంబ్లీతో సంబంధం లేకుండా లేహ్, కార్గిల్లో రెండు కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి రక్షణగా ఉన్న మరో ఆర్టికల్ 35ఏను కూడా రద్దు చేశారు.
ఇప్పుడు దాన్ని పునరుద్ధరించడం ద్వారా ఇతర ప్రాంతాల వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. గతంలో జమ్మూకశ్మీర్లో 15 ఏళ్లు నివసిస్తే స్ధానికులుగా గుర్తించేలా నిబంధనలు ఉండేవి. కానీ ఇప్పుడు అవి వద్దని ఆరో షెడ్యూల్లో చేర్చడం ద్వారా తమ స్ధానికతను, సంస్కృతిని కాపాడాలని వీరు కోరుతున్నారు. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రత్యేక అభివృద్ధి మండళ్ల ఏర్పాటు ద్వారా గిరిజనులకు స్వయంప్రతిపత్తి కల్పిస్తోంది. ప్రస్తుతం అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరంలో మొత్తం ఇలాంటి 10 కౌన్సిళ్లు ఉన్నాయి.