సరిహద్దు వివాదం: త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ కీలక చర్చలు
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో లడఖ్లో తాజా పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా త్రివిధ దళాధిపతులతో శుక్రవారం సమీక్షించారు.
వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద క్షేత్ర స్థాయి పరిస్థితిని సమీక్షించడంతోపాటు రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై రాజ్ నాథ్సింగ్ సీడీఎస్ రావత్ తోపాటు త్రివిధ దళాధిపతులతో చర్చించారని అధికార వర్గాలు వెల్లడించాయి.
వారం రోజుల వ్యవధిలో రాజ్ నాథ్ సింగ్ సైనిక ఉన్నతాధికారులతో సమావేశమవడం ఇది రెండోసారి. భారత్-చైనాల మధ్య ఇటీవల జరిగిన మేజర్ జనరల్ స్థాయి సంప్రదింపులపైనా వారు చర్చించారు. తూర్పు లడఖ్లో ప్రతిష్టంభన నెలకొన్న ప్రాంతాల్లో దళాల మోహరింపు గురించి ఈ భేటీలో రక్షణ మంత్రికి జనరల్ బిపిన్ రావత్ వివరించారు.
కాగా, ఇప్పటికే చైనా ప్రతినిధులతో భారత ప్రతినిధులు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇరుదేశాల రక్షణ దళాలు సరిహద్దు నుంచి వెనక్కి తగ్గాయి. అయితే, మరోసారి చైనా దళాలు సరిహద్దు వెంబడి తమ సైనిక దళాలను మోహరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చైనాతో సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో భారత దళాలు కూడా భారీగా మోహరించినట్లు తెలుస్తోంది.