ఏడాది కిందటే ప్రేమ వివాహం: మృతదేహమై కనిపించిన మహిళా డాక్టర్..!
న్యూఢిల్లీ: ఓ మహిళా డాక్టర్ తన సొంత ఫ్లాట్ లో అనుమానాస్పదంగా మరణించిన ఉదంతం ఇది. హర్యానాలోని గురుగ్రామ్ లో చోటు చేసుకుంది. ఆమె పేరు డాక్టర్ సోనమ్ మోర్. ఏడాది కిందటే ఆమెకు వివాహమైంది. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ట్రామా కేర్ విభాగంలో పని చేస్తోన్న డాక్టర్ శిఖర్ మోర్ ను ఆమె ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం ఎయిమ్స్ ను వదిలి వేశారు. ప్రస్తుతం గురుగ్రామ్ లో ఉన్న ప్రఖ్యాత ఫోర్టిస్ ఆసుపత్రిలో పని చేస్తున్నారు.
Telugu Desam Party: కృష్ణాపై టీడీపీ పట్టుకోల్పోతోందా? వల్లభనేని వంశీ బాటలో మాజీ ఎమ్మెల్యే?
రాజస్థాన్ లోని కోట ప్రాంతానికి చెందిన సోనమ్..ప్రతిష్ఠాత్మకమైన ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అక్కడే డాక్టర్ గా కొనసాగారు. ఆ సమయంలోనే శిఖర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత ఏడాది మే 11వ తేదీన ఆమె శిఖర్ ను వివాహం చేసుకున్నారు. భర్తతో కలిసి గురుగ్రామ్ లోని సెక్టార్ 43లో ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. రెండు రోజులుగా ఆమె ఒంటరిగా ఉంటున్నారు.
ఉదయం ఆమె తన సొంత ఫ్లాట్ లో నిర్జీవంగా కనిపించారు. తెల్లవారిన తరువాత చాలాసేపటి వరకు ఆమె తలుపులు తెరవకపోవడం, ఫోన్ కు బదులు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన ఇతర అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి, తలుపులను పగులగొట్టి చూడగా.. సోనమ్ మృతదేహం నేలపై పడి కనిపించింది. చుట్టూ నిద్రమాత్రలు కనిపించాయి. వెంటనే పోలీసులు డాక్టర్ శిఖర్ మోర్, సోనమ్ తండ్రి ఓంకార్ లాల్ మోతీస్ కు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న ఓంకార్ లాల్.. తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, అల్లుడే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. వివాహమైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం తన కుమార్తెను అల్లుడు శిఖర్ మోర్, అతని తల్లిదండ్రులు వేధింపులకు గురి చేశారని అన్నారు. వారి వేధింపులను భరించలేక కొద్ది రోజుల పాటు తన కుమార్తె పుట్టింట్లోనే ఉన్నారని చెప్పారు. భార్యా భర్త మధ్య రాజీ కుదరడంతో తాము సోనమ్ ను అత్తవారింటికి పంపించామని అన్నారు.
అల్లుడు శిఖర్ మోర్ కు మాదక ద్రవ్యాలను తీసుకునే అలవాటు ఉందని ఆరోపించారు. మాదక ద్రవ్యాలను తీసుకోవడానికి డబ్బులు కావాలని తనను సైతం ఫోన్ లో పలుమార్లు బెదిరించారని చెప్పారు. ఈ ఘటనపై గురుగ్రామ్ లోని సుశాంత్ లోక్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తాము అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని గురుగ్రామ్ పోలీస్ పీఆర్ఓ సుభాష్ బోకెన్ తెలిపారు. ఓంకార్ లాల్ చేసిన ఆరోపణల కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని అన్నారు.