పాస్లు లేకుండానే లోనికి, లగడపాటి, హర్ష స్గోగన్స్
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి ) సమావేశానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్ పాస్లు లేకుండానే హాజరయ్యారు. సమైక్యాంధ్ర ప్లకార్డులతో వారు సమావేశంలో జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా తెలంగాణ పార్లమెంటు సభ్యులు జై తెలంగాన నినాదాలు చేశారు. ఎఐసిసి సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే.
యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన ఆరుగురు సభ్యులకు ఎఐసిసి సమావేశంలోకి ప్రవేశాన్ని నిరాకరిస్తూ పాస్లు ఇవ్వలేదు. దానికి తోడు, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ లగడపాటికి ఫోన్ చేసి సమావేశానికి రావద్దని చెప్పారు. అయినా, లగడపాటి రాజగోపాల్, హర్ష కుమార్ సమావేశానికి హాజరయ్యారు.
2014 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని యుపిఎ చైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రకటించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో జరిగిన ఎఐసిసి సమావేశంలో సోనియా నేతలనుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ గతంలో ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కుందని చెప్పారు.
లౌకికవాద పరిరక్షణకే తమ పోరాటమని సోనియా పేర్కొన్నారు. సమావేశంలో రాహుల్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని కార్యకర్తల నినాదాలు చేయడంతో దీనిపై సోనియా మాట్లాడుతూ ప్రచార కమిటీకి రాహుల్ సారధ్యం వహిస్తారని, సిడబ్ల్యుసి నిర్ణయమే ఫైనల్ అని తెలియజేశారు.
ఎఐసిసి సమావేశం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. యుపిఎ చైర్పర్సన్ సోనియాగాంధీ జెండాను ఆవిష్కరించి సమావేశాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ఇతర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాజీలేదు: లగడపాటి
సమావేశం సందర్భంగా లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ... సమైక్యవాదంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. కాంగ్రెసు పార్టీ తగ్గకుంటే తాము తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచిస్తామన్నారు.