తొలి వేడుక: కార్తీక పౌర్ణమి సందర్భంగా అయోధ్యుకు లక్షల్లో చేరుకున్న భక్తులు
కార్తీకపౌర్ణమి సందర్భంగా సరయు నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు అయోధ్యకు లక్షల సంఖ్యల్లో చేరుకున్నారు. అయోధ్య రామమందిరం బాబ్రీమసీదు భూవివాదం కేసులో సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న అతిపెద్ద వేడుక ఇదే కావడం విశేషం.
కార్తీక పౌర్ణమి కావడంతో లక్షల్లో అయోధ్యకు క్యూ కట్టిన భక్తులు
అయోధ్యలో వివాదంలో ఉన్న భూమి రామాలయంకే చెందుతుందని శనివారం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అదే సమయంలో మసీదు కోసం అయోధ్యలో ఐదెకరాల భూమిని కేటాయించాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత జరుగుతున్న అతి పెద్ద వేడుక కార్తీకపౌర్ణమి కావడంతో అయోధ్య భక్తులతో కిటకిటలాడుతోంది. తీర్పు తర్వాత అక్కడ జరుగుతున్న అతి పెద్ద వేడుక ఇదే కావడంతో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. సరయు నదిలో పవిత్ర స్నానం ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. రామ్ కీ పడీ, నయాఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. దాదాపు ఐదులక్షల మంది పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. సాధారణ రోజుల్లో రోజుకు 8వేల మంది భక్తులు రామజన్మభూమిని సందర్శిస్తారు. ఇక పండగ సీజన్లలో మాత్రం భక్తుల సంఖ్య రోజుకు 50వేలు ఉ:టుంది. ఇక అయోధ్య రామాలయంకు అనుకూలంగా తీర్పు రావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.
భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు జిల్లా కలెక్టర్ అనూజ్ కుమార్ ఝా. దర్శనం కూడా సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అయోధ్యకు వస్తున్న భక్తుల సౌకర్యార్థం కోసం హెల్త్ సెంటర్లు, తాగునీటి సదుపాయం అక్కడక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు. 18 స్థలాల్లో వాటర్ ట్యాంకులు అందుబాటులో ఉండగా.. 20 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 30 మొబైల్ టాయ్లెట్లు కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
కార్తీకపౌర్ణమి అంటే ఏమిటి..?
సోమవారం సాయంత్రం నుంచి కార్తీక పౌర్ణమి ప్రారంభం అవుతుందని అయోధ్య డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ మురళీధర్ చెప్పారు. సోమవారం సాయంత్రం ప్రారంభమై మంగళవారం సాయంత్రం వరకు ఉంటుందని వెల్లడించారు. కార్తీక మాసంలో నిండు చంద్రుడు వచ్చిన రోజునే కార్తీక పౌర్ణమి అని పిలుస్తారు. ఈ పండగనే దేవ్ దీపావళి అని కూడా పిలుస్తారు. అంటే దేవుళ్లు ఈ రోజున దీపావళి పండగ జరుపుకుంటారని అర్థం. దీపావళి పండగ జరిగిన 15 రోజులకు దేవ్ దీపావళి వస్తుంది. గంగా నది తీరంలో ఇతర ఆలయాల్లో దీపాలను వెలిగిస్తారు.