మోడీ నాకు జాబ్ ఆఫర్ చేశారు: సుష్మా స్వరాజ్ భర్త
న్యూఢిల్లీ: మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ వ్యవహారంలో మరో విషయం వెలుగు చూసింది. లలిత్ మోడీ తనకు ఉద్యోగం ఇవ్వజూపారని, అయితే దానిని తాను తిరస్కరించానని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ తెలిపారు.
టైమ్స్ నౌ కథనం ప్రకారం - తాను ఇరవై ఏళ్లుగా లలిత్ మోడీ కుటుంబానికి న్యాయవాదిగా పనిచేస్తున్నానని కౌశల్ తెలిపారు. ఈ క్రమంలో అందుకు ప్రత్యామ్నాయంగా లలిత్ మోడీ 2015 ఏప్రిల్ 24న తనకు ఇండోఫిల్ బోర్డ్లో డైరెక్టర్ పదవిని ఇవ్వజూపారని చెప్పారు. అయితే అందుకు తాను సమ్మతించలేదని కౌశల్ తెలిపారు.
కాగా, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు సుష్మా స్వరాజ్ను లక్ష్యం చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాల మీడియాతో మాట్లాడారు. లలిత్ మోడీ వ్యవహారంలో సుష్మా రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
లలిత్ మోడీకి, సుష్మా కుటుంబానికి మధ్య సంబందమేంటో మోడీ ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సుష్మా స్వరాజ్, లలిత్ మోడీతో ఎన్ని సార్లు భేటీ అయ్యారో దేశ ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు.