లలిత్ మోడీ: రాజే కుమారుని కంపెనీలోకి 11 కోట్లు
న్యూఢిల్లీ: లలిత్ మోడీ పోర్చుగల్ వెళ్లేందుకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన సిఫారసు కొత్త మలుపు తిరిగింది. రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కుమారుడు, ప్రస్తుత ఎంపీ దుష్యంత్ సింగ్కు చెందిన కంపెనీ మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ నుంచి రూ. 11.63 కోట్లు పొందినట్లు ఎనఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణలో పేర్కొంది.
ఈడీ విచారణలో మారిషస్కు చెందిన విల్టన్ ఇన్వెస్ట్మెంట్స్ లి. అనే కంపెనీ నుంచి రూ. 21 కోట్లు లలిత్ మోడీకి చెందిన ఆనంద్ హెరిటేజ్ హోటల్స్ ప్రై. లిమిటెడ్కు వచ్చాయి. ఈ లావాదేవీ ద్వారా వచ్చిన కొంత సొమ్ముని దుష్యంత్ రాజేకు చెందిన నియంత్ హెరిటేజ్ హోటల్స్ ప్రై.లిమిటెడ్ పొందింది.
రూ. 3.80 కోట్ల లావాదేవీని 2008లో భద్రతలేని రుణంగా పొందారు. ఇందుకు గాను 815 షేర్లను రెండు వాయిదా పద్ధతిలో కేటాయించారు. మొత్తంగా రూ. 11.63 కోట్లను లలిత్ మోడీ నుంచి దుష్యంత్ కంపెనీకి బదిలీ అయినట్లు ఈడీ ఒక నివేదికలో పేర్కొంది.
అంతేకాదు వసుంధరా రాజే మొదటిసారి సీఎం అయినప్పుడు, లలిత్ మోడీకి చెందిన ఆనంద్ హెరిటేజ్ హోటల్స్ ప్రై.లిమిటెడ్లోని కొన్ని షేర్లను దుష్యంత్ రాజే కొనుగోలు చేశారు. ఈ విషంయపై దుష్యంత్ సింగ్ను స్పందించారు.
భద్రతలేని రుణంగా పొందిన రూ. 3.80 కోట్లను తాను రాబోయే రెండు ఆర్ధిక సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దుష్యంత్, ఆతని భార్య నిహారిక డైరెక్టర్స్ హోదాలో నియంత్ హెరిటేజ్ హోటల్స్ ప్రై.లిమిటెడ్లో కేవలు రూ. 50,000 మాత్రమే పెట్టుబడి పెట్టారు.
2005లో నియంత్ హెరిటేజ్ హోటల్స్ ప్రారంభించినప్పుడు షేరు ధర రూ.10. ఆ తర్వాత లలిత్ మోడీ నియంత్ హెరిటేజ్ హోటల్స్లో ఒక్కో షేరుని రూ. 96.190 పెట్టి కొనుగోలు చేశారు. మొత్తం 815 షేర్లకు గాను లలిత్ మోడీ నియంత్ హెరిటేజ్ హోటల్స్కు రూ. 7.80 కోట్లను చెల్లించాడు.
వసుంధరా రాజే తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలాంటి ప్రయోజనం పొందకుండానే లలిత్ మోడీ రూ. 10 ముఖ విలువ కలిగిన షేరుని అంత డబ్బు పెట్టి కోనుగోలు చేస్తారనే విమర్శులు కూడా వచ్చాయి. తాజాగా లలిత్ మోడీ ఓ ప్రముఖ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో డిసెంబర్ 2013లో వసుంధరా రాజే, తన భార్యను పోర్చుగల్లో క్యాన్సర్ నిమిత్తం స్వయంగా తీసుకెళ్లారని తెలిపారు.
దీనిని బట్టి చూస్తుంటే లలిత్ మోడీకి, బీజేపీ ప్రభుత్వానికి మధ్య క్విడ్ ప్రో కో ఒప్పందం జరిగే ఉంటుందని విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి. వసుంధరా రాజే మాట విని, లలిత్ మోడీకి వీసా జారీకి సిఫారసు చేసిన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలనే డిమాండ్లు రోజురోజుకీ ఊపందుకుంటున్నాయి.
అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం సుష్మాకు మద్దతుగా మాట్లాడుతున్నారు.