రాందేవ్ భేష్: పతంజలికి బ్రాండ్ అంబాసిడర్ లాలూ
నాలుకకు నరం లేదనే సామెత.. ఇప్పటి రాజకీయాలకు సరిగ్గా సరిపోతుందేమో..! అవసరాన్ని బట్టి మాట మార్చడం రాజకీయాల్లో ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇదే తరహాలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా.. ఒకప్పుడు విమర్శించలు గుప్పించిన వ్యక్తిపైనే ఇప్పుడు ప్రశంసలు కురిపించారు.
ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ పై గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన లాలూ, తాజాగా అదే రాందేవ్ బాబాను పొగడ్తలతో ముంచెత్తారు. ఇంతకీ విషయమేంటంటే.. అంతర్జాతీయ యోగా ధినోత్సవం సందర్భంగా బీహార్ లో జరిగే వేడుకలకు బాబా రాందేవ్ ను ఆహ్వానించేందుకు లాలూ ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా లాలూకు పతాంజలి ఉత్పత్తులను అందజేసిన బాబా రాందేవ్.. ముఖానికి రాసుకునే ఓ క్రీమ్ ను లాలూ ముఖానికి పూశారు.
ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ తమకు నచ్చిన తరహాలో కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే గ్లామరస్ గా కనిపించే లాలూ, ఇక రాందేవ్ ఉత్పత్తులను వాడితే ఇంకెంత గ్లామర్ గా మారిపోతారోన్న కామెంట్స్ నెట్ లో హల్-చల్ చేస్తున్నాయి. ఇక భేటీ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లాలూ.. బాబా రాందేవ్ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ ఉందని, రాందేవ్ ఎదుగుదలను చూసి సహించలేకే కొంతమంది ఆయనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు.
రాందేవ్ ఉత్పత్తులకు సంబంధించి లెక్కా పత్రం అన్నీ సరిగానే ఉన్నాయని, సంపాదించే ప్రతి పైసా లెక్కలను ఆయన ఛారిటీకి అందజేస్తున్నారని రాందేవ్ కి క్లీన్ చిట్ ఇచ్చేశారు లాలూ. చివరలో.. రాందేవ్ ఉత్పత్తులను మీరు ప్రమోట్ చేస్తారా..? అని మీడియా అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ.. తానెప్పటికీ బాబా రాందేవ్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గానే ఉంటానంటూ తనదైన శైలిలో సరదా కామెంట్ చేశారు.