దాణా స్కాంలో నాలుగే కేసులోను లాలూ దోషి, జగన్నాథ్ మిశ్రా నిర్దోషి
పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నాలుగో ఫోడర్ స్కాంలోను దోషిగా రాంచీ కోర్టు తేల్చింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాను నిర్దోషిగా తేల్చింది.
దుంకా ట్రెజరీకి సంబంధించిన స్కాంలో లాలూను దోషిగా తేలుస్తూ రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. అనారోగ్యం కారణాలతో గత శనివారం ఆసుపత్రిలో చేరిన లాలూ నేరుగా కోర్టుకు హాజరయ్యారు.
దాదాపు రెండు దశాబ్దాల క్రితం లాలూ సీఎంగా ఉన్న సమయంలో పశువుల దాణా పేరిట నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో లాలూ, జగన్నాథ్ మిశ్రా తదితరులపై కేసులు నమోదయ్యాయి. లాలూపై మొత్తం అయిదు కుంభకోణాలకు సంబంధించి కేసులు నమోదు కాగా, తొలి కేసులో 2013 సెప్టెంబరులో శిక్ష పడింది. అయితే అదే ఏడాది డిసెంబరులో ఆయనకు సుప్రీం బెయిల్ మంజూరు చేసింది.
ఆ తర్వాత దేవ్గఢ్ ఖజానాకు సంబంధించి కేసులో గతేడాది డిసెంబరులో లాలూ దోషిగా తేలారు. దీంతో ఆయకు కోర్టు మూడున్నరేళ్ల జైలుశిక్ష విధించింది. అప్పటి నుంచి ఆయన బిర్సా ముండా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. మూడో కేసు అయిన చాయ్బాసా ట్రెజరీ కేసులోనూ లాలూను కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయనకు అయిదేళ్ల జైలుశిక్ష విధిస్తూ ఈ ఏడాది జనవరిలో న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. తాజాగా దుంకా ట్రెజరీ నుంచి రూ.3కోట్లకు పైగా నిధులు స్వాహా చేసిన కేసులోనూ లాలూ దోషిగా తేలారు. ఈ కేసులో శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.