బీహార్ సర్కార్ కూల్చేందుకు లాలు కుట్ర : దాణా స్కాం నుంచి బయటపడేందుకు జైట్లీని కలిశారు, సుశీల్ మోదీ
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల జరుగుతోన్న సమయంలో నేతల సంచలన వ్యాఖ్యలు కొనసాగుతోన్నాయి. ఇదివరకు నేతలు చేసిన తెరచాటు రాజకీయాలు ఒక్కొక్కటి బయటపెడుతున్నారు. తాజాగా బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంకీర్ణ సర్కార్ కూల్చేందుకు సై ?
బీహార్లో నితీశ్తో లాలూ ప్రసాద్ యాదవ్ అయిష్టంగా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారని సుశీల్ మోదీ హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు బీహార్లోని తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు లాలూ ప్రసాద్ ముందుకొచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకోసం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని లాలు ప్రసాద్ యాదవ్ కలిసారని తెలిపారు. బీజేపీతో కలిసి బీహార్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారని .. ప్రతీగా పశు దాణా కేసు నుంచి మినహాయిస్తే చాలని పేర్కొన్నారని తెలిపారు.
కల్పించుకోమని తెగేసి చెప్పిన జైట్లీ
కేందమంత్రి ప్రేమ్ చంద్ గుప్తాతో కలిసి జైట్లీని .. లాలు కలిసారని సుశీల్ మోదీ ఆరోపించారు. కానీ ఆర్జేడీ ప్రతిపాదనను జైట్లీ తిరస్కరించారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రతిపాదనలను ఆరెస్సెస్-బీజేపీ అంగీకరించదని జైట్లీ చెప్పినట్టు తెలిపారు. సీబీఐ స్వతంత్ర్య దర్యాప్తు సంస్థ .. అధికారులు వారి విధులను నిర్వర్తిస్తారు‘ అని జైట్లీ తెలిపినట్టు సుశీల్ వివరించారు. ఇలాంటి కేసుల్లో కేంద్ర ప్రభుత్వం కల్పించుకోబోదని జైట్లీ తెగేసి చెప్పారు.
అభద్రతాభవంతోనే విమర్శలు : ఆర్జేడీ
లాలు ప్రసాద్పై సుశీల్ మోదీ ఆరోపణలను ఆర్జేడీ కొట్టిపారేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురయ్యే ఓటమిని జీర్ణించుకోలేకే మోదీ .. తన స్థాయిని మరచిపోయి మాట్లాడుతున్నారని బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ఈ మతిలేని ఆరోపణలతో బీజేపీకి ఎలాంటి ప్రయోజనం చేకూరదు, అసత్య వ్యాఖ్యలతో సుశీల్ మోదీ తన మానసిక స్థితి సరిగా లేదని నిరూపించుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. బీజేపీ అగ్రనేత అద్వానీ చేపట్టిన రథయాత్రను అడ్డుకున్న ధీశాలి లాలుప్రసాద్ యాదవ్ అని గుర్తుచేశారు.