తెర తొలగిందా?: తండ్రీ తనయుల మధ్య కుదరని సంధి!
నాలుగు నెలలుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీలో అంతర్యుద్ధం ముగింపు దశగా అడుగులేస్తున్నదా? అంటే అవుననే చెప్తున్నాయి ఆ పార్టీ వర్గాలు.
లక్నో: నాలుగు నెలలుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీలో అంతర్యుద్ధం ముగింపు దశగా అడుగులేస్తున్నదా? అంటే అవుననే చెప్తున్నాయి ఆ పార్టీ వర్గాలు. యూపీ రాజకీయాల్లో మల్ల యోధుడిగా ఆరితేరిన ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ ఆశలు పెట్టుకున్న పెద్ద కొడుకు యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ 'అసలు సిసలు వారసుడిగా' జనం ముందుకొచ్చారు. బాబాయ్ శివ్ పాల్ సింగ్ యాదవ్, బయటి వ్యక్తి అని చెప్పే అమర్ సింగ్.. అఖిలేశ్కు గిట్టదంటే సమయోచితం.
ఔరా! వారసత్వానికి పోటీనా..
వారిద్దరి పెత్తనానికి తోడు చిన్నమ్మ సాధనాగుప్తా కోడలు అపర్ణాయాదవ్ను తనకు పోటీగా ముందుకు తేవడం ఈ యువనేతకు సుతరామూ ఇష్టం లేదు. అందుకే మరో బాబాయి రాంగోపాల్ యాదవ్ దన్నుతో తండ్రిపై తిరుగుబాటు చేయడమే కాదు, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కానీ, తండ్రి పట్ల ప్రేమ తగ్గనే లేదు. పార్టీలో సీనియర్లు ఆజంఖాన్, గాయత్రి ప్రజాపతి వంటి నేతల మధ్యవర్తిత్వంతో ఫోన్ మంతనాలు.. తర్వాత నేరుగా తండ్రితో ముఖాముఖీ సంప్రదింపులకు తెరతీశారీ యువ సీఎం. కానీ వర్కవుట్ కాలేదు. తర్వాత కూడా పలువురు మంత్రులు, కుటుంబ సభ్యులూ తండ్రీ కొడుకుల మధ్య సయోధ్యకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఫలించని లాలూ ఫోన్ రాయబారం
ఆర్జేడీ అధినేత లాలూ కూడా సయోధ్య కుదిర్చేందుకు శతవిధాల ప్రయత్నించారు. తండ్రీ కొడుకులు కొట్టుకుంటే బిజెపికి లాభం చేకూరుతుందని నచ్చచెప్పేందుకు చూసినా అఖిలేశ్లో మాత్రం మార్పు రాలేదు. సోమవారం సాయంత్రం జరిగిన ఫోన్ రాయబారాల్లో లాలూకు అసలు సంగతి చెప్పేశారు ములాయంను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగించలేమని తమ మధ్య రాజీకి ప్రయత్నించిన ఆర్జేడీ అధినేత లాలూకు సున్నితంగానే యూపీ సీఎం అఖిలేశ్ చెప్పారని తెలుస్తున్నది.
నేతాజీ చీఫ్ అయితే అమర్, శివ్ పాల్లదే రాజ్యం
పార్టీ చీఫ్గా ములాయం ఉంటే ఎన్నికల వేళ అమర్సింగ్, శివ్పాల్ మాటలు వినే అవకాశం ఉందని లాలూతో అఖిలేశ్ చెప్పినట్లు సమాచారం. ఎన్నికలయ్యాక సగౌరవంగా తండ్రిని జాతీయ అధ్యక్షుడిగా నియ మిస్తానని లాలూకు యువనేత వివరించారని తెలుస్తున్నది. ములాయంను పార్టీ చీఫ్గా కొనసా గించాలని కోరినట్లు లాలూ కూడా మంగళవారం మీడియాతో చెప్పారు. లాలూ తన కూతురును ములాయం మనుమడికి ఇచ్చి వివాహం చేసినందుకు వారిద్దరూ బంధువులే. గత అక్టోబర్లో అంతర్గత ఘర్షణ వెలుగుచూసినప్పుడు కూడా లక్నోలో బహిరంగంగానే అబ్బాయ్ బాబాయి మధ్య చేతులు కలిపారు. వివాదాన్ని సద్దుమణిగేలా చూశానని లాలూ చెప్పారు.
ఇద్దరూ ఇద్దరే మరి
అఖిలేశ్ తండ్రి ములాయం నివాసానికి వెళ్లి 90 నిమిషాలు చర్చించాక మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని (సీఈసీ) కలిసిన తర్వాత ములాయం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ తిరిగి విజయం సాధిస్తే అఖిలేశే సీఎం అభ్యర్థి అని ప్రకటించడంతో వారిద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ దఫా భేటీకి శివ్పాల్, అమర్సింగ్ దూరంగా ఉన్నారు. ప్రస్తుత ప్రతిష్టంభన నేపథ్యంలో సైకిల్ గుర్తు దక్కదేమోనన్న భయంతోనే తండ్రీ కొడుకులు సంప్రదింపులు జరిపారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అందుకు 'నేతాజీ' ససేమిరా?
పార్టీ అధ్యక్షుడిగా తానే కొనసాగుతానని తనతో సంప్రదింపులకు వచ్చిన యూపీ సీఎం అఖిలేశ్ ముందు ప్రతిపాదించిన ములాయం.. శివ్ పాల్, అమర్ సింగ్లను పక్కన బెట్టాలన్న డిమాండ్ను మాత్రం అంగీకరించలేదని తెలుస్తున్నది.
సన్నగిల్లిన సంధి అవకాశాలు
పార్టీ చీఫ్ పదవే కీలకాంశం కానుండడంతో ప్రస్తుత పరిస్థితుల్లో తండ్రీ కొడుకుల మధ్య సయోధ్య కుదిరే అవకాశాలు సన్నగిల్లాయని అఖిలేశ్ సన్నిహితులు చెప్తున్నారు. జరుగ కూడని పరిణామాలు చోటుచేసుకున్న తర్వాత గానీ మళ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిస్తే సీఎం అఖిలేశే అన్న ములాయం ప్రకటనను ఇరు పక్షాల మధ్య కొరవడిన పరస్పర విశ్వాసం సందేహిస్తున్నదన్నంటున్నారు.
మోటారు సైకిల్ కోరనున్న అఖిలేశ్?
ఒకవేళ ఈసీ తమకు సైకిల్ గుర్తు కేటాయించకపోతే ప్రత్యామ్నాయంగా మోటారు సైకిల్ గుర్తు కేటాయించాలని అఖిలేశ్ గ్రూపు కోరనున్నదని వార్తలు వచ్చాయి. ఎస్పీ ఎన్నికల గుర్తు సైకిల్ తండ్రీ కొడుకుల మధ్య ఎవరికి దక్కనున్నదని జనవరి 13న తేలనున్నది. ఈ మేరకు ఇరు గ్రూపులకు శుక్రవారం తమ ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన ఈసీ.. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నది. జనవరి 17 నుంచి తొలిదశ నామినేషన్ల ప్రక్రియ ముగిసేలోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఈసీ భావిస్తున్నది.