లాలూ ప్రసాద్ యాదవ్ ఫేస్ బుక్ హ్యాకర్ అరెస్టు
పాట్నా: అర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ చేసి తమాషా చేస్తున్న వ్యక్తిని బీహార్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ చెయ్యడానికి ఉపయోగించిన రెండు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు చెప్పారు.
పోలీసు అధికారుల కథనం మేరకు వైశాలిలోని మోహమ్మదాబాద్ గ్రామానికి చెందిన దివ్యాన్షు కుమార్ అలియాస్ గోలు అనే వ్యక్తి లాలూ ప్రసాద్ యాదవ్ ఫేస్ బుక్ హ్యాక్ చేశాడు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ల మీద గోలుకు అవగాహన ఉంది. కంప్యూటర్ నాలెడ్జ్ చాల ఉందని పోలీసులు అన్నారు.
మార్చి 8,11వ తేదిన లాలూ ప్రసాద్ యాదవ్ అకౌంట్ ను గోలు హ్యాక్ చేశాడు. తరువాత అనుచిత కామెంట్లు పోస్టు చేశాడు. వీటిని గమనించిన లాలూ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ వెంటనే ఆ కామెంట్లు తొలగించారు. తరువాత బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు లాలూ ప్రసాద్ యాదవ్ ఫేస్ బుక్ హ్యాక్ చేసిన గోలును గుర్తించి అతని మీద నిఘా వేశారు. కచ్చితమైన సమాచారం అందడంతో అరెస్టు చేశామని బీహార్ పోలీసు అధికారులు తెలిపారు.