మరింత క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. ఆస్పత్రికి చేరుకున్న కూతురు..
ఆర్జేడీ అధినేత, బీహర్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన కుమార్తె మీసా భారతి రిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమె భర్త, తల్లి రబ్రీ దేవి, కుమారులు తేజస్వీ యాదవ్ పాట్నా నుంచి హెలికాప్టర్లో ఆస్పత్రికి చేరుకోనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిపడటంతో గురువారం రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. లాలూ ప్రసాద్ యాదవ్కు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటీవ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. లాలూ ఆరోగ్యం నిలకబడగా ఉందని రిమ్స్ వైద్యులు తెలిపారు. అయితే ఊపిరితిత్తుల్లో ఇనెప్షన్ వచ్చిందని.. అదీ న్యూమోనియా కావొచ్చన్నారు. దానికి సంబంధించి చికిత్స జరుగుతుందని వివరించారు.
లాలూ ప్రసాద్ ఆరోగ్యం గురించి ఎయిమ్స్లోని ఊపిరితిత్తుల విభాగ అధిపతిని సంప్రదించామని రిమ్స్ వైద్యులు తెలిపారు. అయితే ర్యాపిడ్ టెస్ట్లో కరోనా నెగటివ్ వచ్చిందని.. ఆర్టీ పీసీఆర్ పరీక్ష ఫలితం మాత్రం రేపు (శనివారం) వస్తుందని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కమరేశ్వర్ ప్రసాద్ తెలిపారు.