డిప్యూటీ సీఎంగా 9వ తరగతి చదివిన లాలూ కొడుకు
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.నితీశ్ తన కేబినెట్లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీకి పెద్ద పీట వేయనున్నారని తెలుస్తోంది. లాలూ కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తొమ్మిదో తరగతి వరకు చదివిన తేజస్వీ యాదవ్.. క్రికెటర్గా రాణించాలని భావించారు. ఆ తర్వాత బీహార్ రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. తాజా ఎన్నికల్లో విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తానంటూ బరిలో దిగి విజయం సాధించారు.
తేజస్వీ యాదవ్కు ఉప ముఖ్యమంత్రి పీఠం ఆయనకు దక్కేలా లాలూ ప్రణాళికలు రచించారని, ఆయనే డిప్యూటీ సీఎం అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయ అనుభవం లేని తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా రాణించగలడా? అనే అనుమానం అందరిలోను నెలకొంది. మరోవైపు, లాలూ తనయ మీసాభారతి పేరు కూడా వినిపిస్తోంది.
కాగా, నితీష్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ సహా తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ, రాజ్యసభ నేతలు మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా తదితరులు వస్తున్నారు.
ముఖ్యమంత్రుల్లో... మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, పికే చామ్లింగ్, సిద్ధరామయ్య, వీరభద్ర సింగ్, తరుణ్ గొగోయ్, ఇబోబిసింగ్, నబమ్తుకి తదితరులు హాజరు కానున్నారు. కేంద్రమంత్రులు వెంకయ్య, రాజీవ్ ప్రతాప్ రూడీలు హాజరవుతారు.