మూత్రం, డెట్టాల్ రెండూ ఒక్కటే: లాలు ప్రసాద్
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలు ప్రసాద్ యాదవ్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ వార్తలలో ఉండాలనుకునే లాలు ప్రసాద్ యాదవ్ ఈ సారి మనిషి మూత్రానికి, డెట్టాల్ కు ముడి పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
పాట్నాలో జరిగిన హోమియోపతిక్ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గోన్న లాలు ప్రసాద్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు మనం సాధించిన ప్రగతి ఏమిటంటే డెట్టాల్ తో చేతులు శుభ్రం చేసుకోవడమే అని వ్యంగంగా అన్నారు.
ఇదే సందర్బంలో ఆయన తన చిన్నతనం గురించి వివరించారు. చిన్నతనంలో దెబ్బలు తగిలితే మూత్రంతో కడిగేస్తే గాయం తగ్గిపోయేది అన్నారు. మూత్రం యాంటీ సెప్టిక్ గా పని చేస్తుందని వివరించారు.
ఇప్పుడు ఎవరికైనా దెబ్బలు తగిలితే డెట్టాల్ తో శుభ్రం చేస్తున్నారని గుర్తు చేశారు. కొందరు మరో అడుగు ముందుకు వేసి ఎప్పుడు పడితే అప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటున్నారని, మన దేశం సాధించిన అభివృద్ది ఇదే అంటూ ఎద్దేవ చేశారు.
పెద్ద కొడుకుకు బదులుగా.................!
ఈ సమావేశంలో బీహార్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పాల్గోనాలి. అయితే మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కు బదులుగా ఆ కార్యక్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమానికి తేజ్ ప్రతాప్ యాదవ్ హాజరుకాలేదు.