కుమారుడి పెళ్లి: లాలూ ప్రసాద్ యాదవ్కి 5రోజుల పెరోల్
రాంచి: దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు న్యాయస్థానం ఐదు రోజులు పెరోల్ ఇచ్చింది. త్వరలో లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ వివాహం జరుగనున్న నేపథ్యంలో కోర్టు ఆయనకు పెరోల్ ఇచ్చింది.
బీహార్ మంత్రి చంద్రిక రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్ను తేజ్ ప్రతాప్ మే 12న పెళ్లాడబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు లాలూ హాజరుకాలేకపోయారు. దీంతో ఐ మిస్ యూ పాపా అంటూ సోషల్ మీడియాలో తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యాఖ్యానించారు.
'ఐ మిస్ యూ పాపా': నిశ్చితార్థం రోజున లాలూ కోసం తేజ్ ప్రతాప్ భావోద్వేగ ట్వీట్
ఈ నేపథ్యంలో పెళ్లికి హాజరయ్యేందుకు లాలూకు పెరోల్ ఇచ్చినట్లు న్యాయస్థానం వెల్లడించింది. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని రాంచిలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
లాలూ కిడ్నీ, హృద్రోగ సమస్యలతో బాధపడుతుండడంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించేందుకు సీబీఐ న్యాయస్థానం అనుమతించింది. చికిత్స అనంతరం లాలూ కోలుకోవడంతో ఇటీవల ఆయన్ని డిశ్చార్జి చేశారు.