లాలూ కష్టాలకు నా శాపమే కారణం: తొలి ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే బానో సంచలనం
ఇటీవల ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్తోపాటు ఆయన కుటుంబసభ్యులను అవినీతి, అక్రమాల కేసులు వెంటాడుతున్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: ఇటీవల ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్తోపాటు ఆయన కుటుంబసభ్యులను అవినీతి, అక్రమాల కేసులు వెంటాడుతున్న విషయం తెలిసిందే. గడ్డి కుంభకోణం, సీబీఐ, ఈడీ దాడులతో లాలూ, ఆయన కుమారులు, కుమార్తె కూడా వరుస చిక్కులను ఎదుర్కొంటున్నారు. కాగా, ఈ పరిణామాలన్నింటికీ తన శాపమే కారణమంటున్నారు దేశంలో తొలి ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే షబ్నమ్ మౌసీ బనో.
షబ్నమ్.. 1998లో మధ్యప్రదేశ్లోని సొహగ్పూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచి చరిత్ర సృష్టించారు. అయితే, లాలూ తనను మోసగించారని, తాన శాపం కారణంగానే ఇప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
2008లో కోట్మా నియోజకవర్గం నుంచి పోటీ చేసే సమయంలో తనకు ఆర్థిక సాయం చేస్తానని లాలూ హామీ ఇచ్చారని, ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటానని కూడా చెప్పారని.. అయితే, తనకు ఎలాంటి సాయం చేయకుండా మోసగించారని షబ్నమ్ తెలిపారు. లాలూ మోసం వల్లే తాను ఓడిపోయానని చెప్పుకొచ్చారు.
కాగా, 2012లో యూపీలోని కాన్పూర్ కంట్ నియోజకవర్గం నుంచి పోటీచేసి మరోసారి ఓటమిని చవిచూశారు. ఓసారి లాలూను ఢిల్లీలో కలిస్తే ఆయన తన ఓటమిపై వెకిలిగా మాట్లాడారని, తనకు ఛార్జీలు, ఖర్చుల కోసం రూ. 10వేలు ఇచ్చి పంపండని ఆయన తన మనుషులతో అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'లాలూ మాటలతో మనస్తాపానికి గురయ్యా. నా శాపం ఆయనకి తగిలింది. ఆయనకి, ఆయన కుటుంబానికి చెడ్డరోజులు వచ్చాయి' అని షబ్నమ్ తెలిపారు. కాగా, 2018లో మధ్యప్రదేశ్లోని రేవా నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రస్తుతం షబ్నమ్ సిద్ధమవుతున్నారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే పనితీరుపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు తనను పోటీ చేయాలని కోరుతున్నారని తెలిపారు.
అయితే, తన దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని ఎన్నికల ఖర్చు భరిస్తే పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పినట్లు షబ్నమ్ తెలిపారు. షబ్నమ్ జీవితగాథ ఆధారంగ 2005లో బాలీవుడ్లో 'షబ్నమ్ మోసీ' పేరుతో ఓ చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. ఇందులో అశుతోష్ రాణా నటించారు. కాగా, షబ్నమ్(56).. 12 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. ఇప్పటికీ ఆమె హెచ్ఐవీ/ఎయిడ్స్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేగాక, లింగ సమానత్వం కోసం పోరాటం కొనసాగిస్తున్నారు.