జైల్లో చలిగా ఉంది! ఐతే తబలా వాయించు!!: లాలూకు జడ్జీ కౌంటర్
రాంచీ: దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ సహా దోషులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేయాల్సిన నేపథ్యంలో గురువారం లాలూ కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా కోర్టు గదిలో న్యాయమూర్తికి, లాలూకి మధ్య సరదా సంభాషణ జరిగింది.
'ఇక్కడ(జైలులో) చాలా చలిగా ఉంది' అని.. లాలూ వ్యాఖ్యానించారు. అది విన్న సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి శివ్పాల్సింగ్.. అయితే 'తబలా(సంగీత వాద్యం) వాయించు' అని లాలూకి కౌంటర్ వేశారు. అంతేగాక, లాలూ మనుషుల నుంచి తనకు ఫోన్లు కూడా వస్తున్నాయని న్యాయమూర్తి చెప్పడం గమనార్హం.
కాగా, విచారణ సమయంలో మరోసారి లాలూ తాను న్యాయవిద్యను అభ్యసించానని కూడా చెప్పారు. దాణా కుంభకోణం కేసులో లాలూ, సహా ఇతర దోషులకు జనవరి 3న శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది.
కానీ , బుధవారం న్యాయవాది విందేశ్వర ప్రసాద్ మృతితో తీర్పును గురువారానికి వాయిదా వేశారు. అయితే, మళ్లీ శిక్షల ఖరారు శుక్రవారానికి వాయిదా పడింది. పరిస్థితులను బట్టి నేటి తీర్పుకు లాలూ వీడియో కాన్ఫరెన్స్ లేదా వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం ఉంది.