జైలు శిక్ష: తట్టుకోలేక లాలూ ప్రసాద్ యాదవ్ సోదరి మృతి
పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సోదరి గంగోత్రి దేవీ ఆదివారంనాడు మరణించారు. దాణా కుంభకోణం కేసులో అంతకు ముందు రోజే లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్ష పడింది.
లాలూ ప్రసాద్కు జైలు శిక్ష పడడాన్ని తట్టుకోలేక దిగ్బ్రాంతికి గురై ఆమె మరణించినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే లాలూ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి గంగోత్రి నివాసానికి చేరుకున్నారు.
లాలూకు శిక్ష పడకూడదని 73 ఏళ్ల గంగోత్రి గత కొద్ది రోజులుగా క్రమం తప్పకుండా ప్రార్థనలు చేస్తోందని, ఆదివారం రోజంతా ప్రార్థనలు చేస్తూనే గడిపిందని, లాలూ త్వరగా విడుదల కావాలని ఆదివారంనాడు ఆమె పూజలు చేసిందని అన్నారు.
దిగ్భ్రాంతికి గురై తట్టుకోలేక గంగోత్రి మరణించిందని రబ్రీ దేవి విలపిస్తూ మీడియా ప్రతినిధులతో అన్నది. విషయం తెలిసిన వెంటనే లాలూ కుమారులు తేజస్వి, తేజ్ ప్రతాప్ ఆమెకు పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పించారు.