'ఆర్ఎస్ఎస్కు పోటీగా డీఎస్ఎస్.. మతోన్మాదాన్ని అడ్డుకోవడానికే'
ఆర్ఎస్ఎస్ చేస్తున్న అరాచాకాలను అడ్డుకోవడమే ప్రధాన ధ్యేయంగా డీఎస్ఎస్ సంస్థ పనిచేస్తుందని తేజ్ ప్రతాప్ తెలిపారు.
బీహార్: ఆర్ఎస్ఎస్ పునాదుల నుంచే బీజేపీ రాజకీయాలు దేశంలో ఇంతటి స్థాయికి చేరుకున్నాయన్నది అందరికి తెలిసిన విషయమే. దేశవ్యాప్తంగా బలమైన కేడర్ కలిగిన ఆర్ఎస్ఎస్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) బీజేపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్ఎస్ఎస్కు పోటీగా మరో సంఘ్ ఏర్పాటైంది.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తాజాగా ధర్మనిరుపేక్ష సేవక్ సంఘ్ (డీఎస్ఎస్) ను ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ఎస్ చేస్తున్న అరాచాకాలను అడ్డుకోవడమే ప్రధాన ధ్యేయంగా ఈ సంస్థ పనిచేస్తుందని తేజ్ ప్రతాప్ తెలిపారు.
సెక్యులర్ దేశమైన భారత్ లో ఆర్ఎస్ఎస్ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. రానున్న రోజుల్లో ఆర్ఎస్ఎస్ మతోన్మాదాన్ని డీఎస్ఎస్ అడ్డుకుంటుందని, అన్ని మతాల మధ్య సామరస్యపూర్వక వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఈ సంస్థ పనిచేస్తుందని తేజ్ ప్రతాప్ యాదవ్ తెలియజేశారు.
ముందు ఆర్ఎస్ఎస్ లో చేరు తెలుస్తుంది: సుశీల్ కుమార్ మోడీ
తేజ్ ప్రతాప్ స్థాపించిన డీఎస్ఎస్ కు సుశీల్ కుమార్ మోడీ కౌంటర్ ఇచ్చారు. ముందు ఆర్ఎస్ఎస్ లో చేరి ఒక సంవత్సరం పాటు దాని పనితీరును పరిశీలించాలని సూచించారు. తేజ్ ప్రతాప్ డీఎస్ఎస్ విజయం సాధించాలని, కానీ దానికంటే ముందు కొంత అనుభవం ఆయనకు అవసరమని సుశీల్ కుమార్ మోడీ అన్నారు. ఇందుకోసం ఆర్ఎస్ఎస్ లో చేరి నిక్కర్లు వేసుకోవడం, భారత్ మాతా కీ జై అనడం వంటివి చేయాలని ఎద్దేవా చేశారు.
సుశీల్ కుమార్ మోడీ వ్యాఖ్యలపై తేజ్ ప్రతాప్ సైతం కౌంటర్ ఇచ్చారు. హాఫ్ ప్యాంట్స్(నిక్కర్లు) వేసుకునేవారికి హాఫ్ నాలెడ్జి మాత్రమే ఉంటుందని విమర్శించారు.