నాన్న గారు వచ్చేటి వేళా... నితీశ్ను సాగనంపే వేళ... తేజస్వి పంచ్... మహాకూటమి ఫుల్ జోష్...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉన్నారు మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్. ఎన్నికల్లో విక్టరీ తమదేనని... ఎన్డీయేని మట్టికరిపించడం ఖాయమని చెప్తున్నారు. తాజా ఎన్నికల ర్యాలీలో తేజస్వి మాట్లాడుతూ.. నవంబర్ 9న తన తండ్రి,మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్పై జైలు నుంచి విడుదలవుతున్నారని చెప్పారు. ఆ మరుసటిరోజే.. అంటే ఎన్నికల ఫలితాలు వెలువడే నవంబర్ 10న నితీశ్ కుమార్ను ఇంటికి సాగనంపుతున్నామని ఎద్దేవా చేశారు.
ఆరోజే నా పుట్టిన రోజు కూడా : తేజస్వి
శుక్రవారం(అక్టోబర్ 23) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి తేజస్వి యాదవ్ హిసువాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తేజస్వి ప్రసంగిస్తూ.. 'నవంబర్ 9న లాలూ జైలు నుంచి బెయిల్పై వస్తున్నారు. అదే రోజు నా పుట్టినరోజు కావడం విశేషం. ఆ మరుసటిరోజే నితీశ్కు వీడ్కోలు చెప్తాం...' అని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతిని అంతం చేయడంలో నితీశ్ సర్కార్ వైఫల్యం చెందిందని తేజస్వి ఆరోపించారు. ఇతర రాష్ట్రాలక వలసలను నిరోధించడంలో... యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందన్నారు.
నితీశ్ జీ మీరు అలసిపోయారు...
'నితీశ్ జీ.. మీరు అలసిపోయారు. ఇక బీహార్ను పాలించడం మీవల్ల కాదు. రాష్ట్రం పారిశ్రామికీకరణను కూడా కోల్పోయింది. దీంతో నిరుద్యోగం పెరిగింది. మహాకూటమి అధికారంలోకి వస్తే.. తొలి కేబినెట్ మీటింగ్లోనే 10లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. తమ 15 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు సరైన విద్య,వైద్య,ఉద్యోగ అవకాశాలు కల్పించలేనివాళ్లు... మరోసారి అవకాశమిస్తే... ఆ ఐదేళ్లలో మాత్రం ఏం చేయగలరు...? ప్రధాని మోదీ కూడా ఎన్నికల ర్యాలీ కోసం బీహార్ రానున్నారు. బీహార్కు ప్రత్యేక హోదా ఎప్పుడు కల్పిస్తారో ఆయన చెప్తారని ఆశిస్తున్నా..' అంటూ తేజస్వి యాదవ్ పేర్కొన్నారు.
Recommended Video
మహాకూటమి ఫుల్ జోష్...
లాలూ ప్రసాద్ యాదవ్ లేకుండా ఆర్జేడీ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడం ఇదే తొలిసారి. మహాకూటమిలో ఆర్జేడీ ప్రస్తుతం పెద్దన్న పాత్ర పోషిస్తుండగా... తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగారు. ప్రతీరోజూ పదుల సంఖ్యలో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటూ తేజస్వి బిజీబిజీగా గడుపుతున్నారు. తేజస్వి ఎన్నికల ర్యాలీలకు జనం భారీగా తరలివస్తుండటంతో... మహాకూటమిలో గెలుపుపై ధీమాతో ఉంది. మహాకూటమి సభలకు భారీగా జనం తరలిరావడం... నితీశ్ కుమార్ పాలనపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని తేజస్వి చెబుతున్నారు. బీహార్ ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారని... తప్పకుండా తమకే ఓటేస్తారని నమ్మకంగా చెబుతున్నారు.