లాలూకు మూడున్నరేళ్ల జైలు: దాణా స్కాంలో సీబీఐ కోర్టు తీర్పు
రాంచీ: దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు సీబీఐ కోర్టు మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక, ఐదు లక్షల జరిమానా కూడా విధించింది.
Recommended Video
దాణా కుంభకోణం కేసులో లాలూతోపాటు 15మందిని డిసెంబర్ 23న దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. మాజీ బీహార్ సీఎం జగన్నాథ్ మిశ్రాతోపాటు మరో ఆరుగురిని నిర్దోషులుగా కోర్టు తేల్చింది. లాలూ వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా శిక్షను విధించాలని ఆయన తరపు న్యాయవాది జడ్జీని కోరిన నేపథ్యంలో ఈ మేరకు శిక్ష విధించినట్లు తెలుస్తోంది.
లాలూ జైలు శిక్షను ఇప్పటికే ప్రకటించాల్సి ఉన్నా.. జడ్జి శిక్ష ఖరారును రెండు సార్లు వాయిదా వేశారు. లాలూతో సహా మిగితా దోషులు ఫూల్ చంద్, మహేశ్ ప్రసాద్, బకె జులియస్, సునీల్ కుమార్, సుశీల్ కుమార్, సుధీర్ కుమార్, రాజారామ్కు మూడున్నర జైలు శిక్షతో పాటు రూ. 5 లక్షల ఫైన్ను కోర్టు విధించింది. తీర్పుపై పైకోర్టుకు వెళతామని లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ చెప్పారు.
బీహార్లో దాణా కోసం రూ.900 కోట్లు ఖర్చు చేశారు. ఆ మొత్తాన్ని అక్రమంగా ప్రభుత్వ ఖజానా నుంచి విత్డ్రా చేసుకున్నారు. పశుసంవర్థకశాఖ పేరుతో ఆ మొత్తం సొమ్మును కాజేశారు. వివిధ జిల్లాల నుంచి ఆ అమౌంట్ను విత్ డ్రా చేశారు. రెండు దశాబ్ధాల పాటు లాలూ సీఎంగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం జరిగింది. దాణా సరఫరా చేస్తున్నారని లేని కంపెనీలను సృష్టించి.. వాటి పేరుతో డబ్బులు డ్రా చేశారు.
1997, అక్టోబర్ 27న దాణా కేసులో మొత్తం 38 మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిలో ఇప్పటికే 11 మంది చనిపోయారు. మరో ముగ్గురు అప్రూవర్లుగా మారారు. మరో ఇద్దరిని దోషులుగా తేల్చారు. అయితే దాణా కుంభకోణంకు సంబంధించిన డియోఘర్ ట్రెజరీ కేసులో తీర్పును రీసెంట్గా వెల్లడించారు. 1991 నుంచి 1994 మధ్య ఆ ట్రెజరీ నుంచి పశుదాణా కోసం రూ.89 లక్షల విత్డ్రా చేశారు. దాణా కేసులో ఇప్పటివరకు వేర్వేరు కోర్టుల్లో 500 మందిని దోషులుగా తేల్చారు. అందులో లాలూ కూడా ఒకరు.