‘తీర్పు సవాల్ చేస్తాం: బీజేపీతో కలిస్తే లాలూ హరిశ్చంద్రుడే’
పాట్నా: దాణా కుంభకోణంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హైకోర్టు, సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బీహార్ మాజీ మంత్రి తేజస్వీ యాదవ్ అన్నారు. లాలూ సహా ఏడుగురికి శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో తన తల్లి రబ్రీదేవితో కలిసి మీడియాతో మాట్లాడారు.
లాలూకు మూడున్నరేళ్ల జైలు: దాణా స్కాంలో సీబీఐ కోర్టు తీర్పు
తన తండ్రిని అనవసరంగా ఈ కేసులో ఇరికించారని తేజస్వీ యాదవ్ ఆరోపించారు. ఒకవేళ బీజేపీతో సఖ్యతగా ఉండి ఉంటే తన తండ్రికి రాజా హరిశ్చంద్ర బిరుదు ఇచ్చేవారని విమర్శించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సైతం ఆ పార్టీతో కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు.
లాలూ అంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు అభద్రతా భావం పట్టుకుందని, దాంతో బీజేపీతో చేయి కలిపి లాలూకు వ్యతిరేకంగా చెత్త రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. లాలూ నోరు నొక్కేయడానికి బీజేపీ చేయాల్సినదంతా చేస్తోందన్నారు.
తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పుపై హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో సవాల్ చేస్తామని చెప్పారు. తన తండ్రి ఎక్కడ ఉన్నా ఏ మాత్రం భయపడరని, తన భావజాలానికి కట్టుబడి ఉంటారని అన్నారు. లాలూ మరో తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, త్వరలోనే తన తండ్రికి బెయిల్ వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.