హనుమంతప్పకు సలాం: మృత్యువుతో ఆయన పోరాటం దేశానికే విస్మయం..
ఉక్కు మనిషి అన్న పదానికి సరైన నిర్వచనం లాన్స్ నాయక్ హనుమంతప్ప. 35అడుగుల మంచు కింద 6రోజుల పాటు మృత్యువుతో పోరాడి సజీవంగా బయటపడ్డ వ్యక్తి.
ఉక్కు మనిషి అన్న పదానికి సరైన నిర్వచనం లాన్స్ నాయక్ హనుమంతప్ప. 35అడుగుల మంచు కింద 6రోజుల పాటు మృత్యువుతో పోరాడి సజీవంగా బయటపడ్డ వ్యక్తి. దేశం మొత్తాన్ని నివ్వెరపోయేలా చేసిన ఆ ఘటన హనుమంతప్పకు ఒక పునర్జన్మ అనుకున్నారు. కానీ ఇంతలోనే విషాదం కబళించింది.
హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితి అప్పటికే చేయి దాటడంతో.. ఆ మరుసటి రోజు ఆయన కన్నుమూశారు. భౌతికంగా హనుమంతప్ప దూరమైనా.. విధి నిర్వహణలో ఆయన ప్రదర్శించిన ధృఢ సంకల్పం దేశానికే స్ఫూర్తిగా నిలిచింది.
ఎత్తయిన యుద్దభూమి:
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్దభూమిగా పేరుగాంచిన సియాచిన్ మంచు పర్వత శ్రేణుల్లో హనుమంతప్ప మృత్యువుతో పోరాడిన విధానం ప్రతీ ఒక్కరిని విస్మయపరిచింది. తనతో పాటు ఉన్న మిగతా 9మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా హనుమంతప్ప ఒక్కడే 6రోజుల పాటు అదే మంచులో మృత్యువుతో పోరాడాడు.
సియాచిన్ గ్లేసియర్:
గతేడాది ఫిబ్రవరి 3న సియాచిన్ గ్లేసియర్ వద్ద కొండ చరియలు విరిగిపడటంతో హనుమంతప్ప సహా మరో 10మంది మంచులో కూరుకుపోయారు. ఘటన జరిగిన రోజే దాదాపుగా అందరూ చనిపోయి ఉంటారని ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ మృతదేహాల కోసం సైన్యం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లో హనుమంతప్ప ప్రాణాలతో బయటపడ్డం పెద్ద సంచలనమే అయింది.
పరిస్థితి చేయి దాటి:
ఆ తర్వాత ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో హనుమంతప్పకు చికిత్స అందించినా.. అప్పటికే పరిస్థితి చేయి దాటడంతో ఫిబ్రవరి 11,2016న హనుమంతప్ప కన్నుమూశాడు. దీంతో హనుమంతప్ప ప్రాణాల కోసం పూజలు, ప్రార్థనలు చేసిన దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారు. హనుమంతప్పకు కన్నీటి వీడ్కోలు పలికారు.
యోగా ట్రైనర్:
హనుమంతప్ప యోగా ట్రైనర్ కావడం వల్లే 35అడుగుల మంచులో కూరుకుపోయినా ప్రాణాలతో బయటపడినట్లుగా చెబుతారు. సైనికులకు యోగా శిక్షణ ఇచ్చే హనుమంతప్పకు.. ప్రతికూల పరిస్థితుల్లో శ్వాస నియంత్రణ గురించి పూర్తి అవగాహన ఉండటం వల్లే 122గం. పాటు తన ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడంటారు.