'హనుమంతుడి పేరు పెట్టుకోవడం వల్లే బతికాడు'
హైదరాబాద్: హిమాలయాలలో మంచు గడ్డల కింద కూరుకుపోయిన లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పద్ మృత్యువును జయించి బయటపడ్డాడనే సమాచారం తెలియడంతో ఆయన కుటుంబం మంగళవారం నాడు ఊపిరి పీల్చుకుంది.
విషయం తెలిసిన తర్వాత కర్ణాటకలోని ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకా బెటదూరు గ్రామంలోని కుటుంబ సభ్యుల సంతోషం ఆకాశాన్ని అంటింది. ప్రత్యేక పూజలు చేసిన హనుమంతప్ప భార్య మహాదేవి మాట్లాడుతూ.. భగవంతుడు తన ప్రార్థనల్ని మన్నించాడన్నారు.
హనుమంతప్ప బతికే ఉన్నట్లు మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో తమకు ఫోన్ వచ్చిందనీ, అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చూస్తానా అంటూ క్షణాల్ని లెక్కిస్తూ గడిపానని చెప్పారు. తామంతా పునర్జన్మ ఎత్తినట్లు ఉందన్నారు.
ఒక దశలో హనుమంతప్ప బతికి ఉంటారనే ఆశలు కోల్పోయామన్నారు. సైనికుడి తల్లి బసవ్వ విలేకరులతో మాట్లాడుతూ... హనుమంతుడి పేరు పెట్టుకోవడం వల్లనే తన బిడ్డ బతికాడని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు రాజీవ్ చంద్రశేఖర్ సహకారంతో హనుమంతప్ప కుటుంబ సభ్యులు ఢిల్లీ వెళ్లారు.